టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో ఎంచక్కా ఫ్యామిలీతో కలిసి ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. మహేష్ ఈ యేడాది సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా సూపర్ హిట్ అవ్వడంతో దానిని ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న మహేష్ ఏ సినిమా చేయాలి అన్న డైలమాలో ఉండగానే కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో అసలు మొత్తం సినిమా షూటింగ్ లే అన్ని బంద్ అయ్యాయి. వాస్తవంగా మహేష్ సరిలేరు తర్వాత దిల్ రాజు బ్యానర్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ముందుగా ప్లాన్ చేసుకున్నాడు.
అయితే వంశీ రెడీ చేసిన కథ మహేష్ కు ఎంత మాత్రం నచ్చలేదట. రెండు సార్లు విన్నాక కూడా మహేష్ ఈ కథతో సినిమా చేసేందుకు ఆసక్తిగా లేనని అటు వంశీకి.. ఇటు దిల్ రాజుకు తెగేసి చెప్పేశాడట. దీంతో అటు తిరిగి ఇటు తిరిగి మహేష్ కొత్త సినిమా ముందు అనుకున్న పరశురాం దగ్గరే ఆగిపోయింది. పరశురాం చెప్పిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథ మహేష్కు బాగా నచ్చిందని.. పరశు రాంతోనే మహేష్ నెక్ట్స్ సినిమా ఉంటుందన్నది దాదాపు ఖరారైంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు మహేష్ ఈ సినిమాలో సింగర్ గా మారబోతున్నాడట. పరుశురాం సినిమాలో ఒక టైటిల్ సాంగ్ ఉంటుందని.. ఆ సాంగ్ మహేషే స్వయంగా పాడే అవకాశం ఉందని సమాచారం. ఇక మహేష్ స్వయంగా టైటిల్ సాంగ్ పాడితే అంతకు మించిన రచ్చ మరొకటి ఉండదుగా..? ఇక ఈ సినిమాను ఎవరు నిర్మిస్తారు ? ఎప్పుడు నుంచి షూటింగ్ ప్రారంభ మవుతుంది అన్న దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
ఇక ఇప్పటికే మహేష్ బాబు భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు లాంటి వరుస హిట్లతో హ్యాట్రిక్ కొట్టేశాడు. మరి ఈ నాలుగో సినిమాతో అయినా హిట్ కొడతాడేమో ? చూడాలి.