పూనమ్ కౌర్.. సినిమాలతో కంటే వివాదాలతో ఎక్కువగా పాపులర్ అయింది. ఎప్పుడు ఎవరి మీద ట్వీట్ చేస్తుందో.. ఎందుకు చేస్తుందో.. తెలియదు కాని.. ఆమె ట్వీట్ చేసిన ప్రతిసారి వైరల్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మరోసారి వార్తల్లో నిలిచింది. నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు మరికొందరు ప్రముఖులు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ కూడా ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి అంజలి ఘటించారు. ఎన్టీఆర్ ను తెలుగు ప్రజల దేవుడిగా అభివర్ణించారు. "స్వర్గంలో ఉన్న మీరు నన్ను ఆశీర్వదించండి. దుష్ట శక్తులతో పోరాడే ధైర్యాన్నిచ్చేలా దీవించండి. మానవత్వం బొత్తిగా కరవైన ఈ రోజుల్లో మీవంటి నేతలు, మీవంటి నటుల అవసరం ఎంతో ఉంది" అంటూ భావోద్వేగాలు ప్రదర్శించారు.

 

కాగా స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు జాతి, తెలుగు సినిమా ప్రపంచం గురించి ఎలుగెత్తి చాటి చెప్పారు. తెలుగు జాతి గురించి ప్రస్థావించాల్సి వచ్చిన ప్రతీసారి ఎన్టీఆర్ పేరు కచ్చితంగా పేర్కొనవల్సిందే. ఎందుకంటే తెలుగు భాషను, తెలుగు సినిమా ప్రపంచానికి ఓ గుర్తింపును తీసుకొచ్చి మన ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచారు. తెలుగు జాతి మొత్తం అందుకే ప్రేమగా అన్నగారు అని సంబోధించుకుంటుంది. అంతటి మహనీయుడు జయంతి నేడు. ఈ సందర్భంగా యావత్ సినీ లోకం నివాళిని అర్పించింది. ఈ క్రమంలో చిరంజీవి, మోహన్ బాబు, వెంకటేష్ ఎన్టీఆర్‌తో నాడు దిగిన ఫోటోలను షేర్ చేశారు. లాక్ డౌన్ నిబంధనలకు విఘాతం కలిగించడం ఇష్టం లేక ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లబోవడం లేదని ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తాతను తలుచుకుని ఎమోషనల్ అయ్యాడు. ''నీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతుంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లి పోతుంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా'' అని ట్వీట్ చేశాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: