అనుష్క శెట్టి.. పరిచయం అక్కర్లేని, ఎప్పటికీ మరచిపోలేని పేరు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున,సోను సూద్ ప్రధానపాత్రలలో యాక్షన్ ఎంటర్టైనర్ గా విడుదలైన `సూపర్` సినిమాతో సాషా అనే ఒక మాస్ క్యారక్టర్తో కెరీర్ను ప్రారంభించిన అనుష్క.. రాజమౌళి దర్శకత్వం వహించిన 'విక్రమార్కుడు' చిత్రంతో భారీ విజయాన్ని అందుకుంది. ఆ తరువాత ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో నటించి ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్గా దశాబ్దంపైగా సినీ పరిశ్రమలో రారాణిగా వెలుగొందింది.
గ్లామర్ తప్ప మరేమీ పెద్దగా పట్టించుకోని సినీ పరిశ్రమలో ఓ దశాబ్దంపైగా విజయవంతంగా కొనసాగటం అంటే ఆషామాషీ ఏమీ కాదు. అయితే అనుష్క శిఖరానికి చేరారు. వాస్తవానికి చిత్ర పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో గ్లామర్ పాత్రలతో కుర్రకారు మతులు పొగొట్టిన ఈ ముద్దుగుమ్మ..తర్వాత హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రలతోనూ దుమ్మురేపారు. ముఖ్యంగా ‘అరుంధతి’ సినిమా ఆమె సినీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసిందని చెప్పొచ్చు. హారర్ మూవీలలో అరుంధతి ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోయింది. ఈ మూవీ తరువాత అనుష్క టాలీవుడ్ లో లేడీ ఓరియెంట్ చిత్రాలకు కేర్ అఫ్ అడ్రస్ గా మారిపోయింది.
ఈ క్రమంలోనే హీరోయిన్ ఒరియంటెడ్ చిత్రాలు అలోచించే దర్శకులకు ముందు అనుష్కనే గుర్తుకు వస్తుంది. ఈ స్వీటీతో భారీ బడ్జెట్ సినిమాలు చేయడంలోనూ నిర్మాతలు వెనుకడుగు వేయ్యరు. అలాగే మిర్చి, సింగం, బిల్లా వంటి హిట్ చిత్రాలలో గ్లామర్ హీరోయిన్ గా చేసిన అనుష్క వేదం వంటి సినిమాలో వేశ్యగా చేసి అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా.. తాను ఎలాంటి పాత్ర అయినా చేయగలను అని నిరూపించింది. ఇక బాహుబలి సిరీస్ లో వచ్చిన రెండు చిత్రాలలో దేవసేనగా నటించి ఆమె అంతర్జాతీయ గుర్తింపు పొందింది అనుష్క.
ఇలా గ్లామర్ రోల్స్ అయినా.. లేడీ ఓరియంటెడ్ రోల్స్ అయినా.. ఇంకా ఎలాంటి పాత్రలైనా కూడా ఆమె ముందు ఒదిగి పోవాల్సిందే. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకున్నా.. అంచలంచలుగా ఎదిగిన అనుష్క.. అందం, అభినయం, నటనతో ప్రేక్షకులను ఏళ్ల పాటు ప్రభావితం చేసింది. అందుకే అనుష్క ఎందరికో అదర్శంగా నిలిచిందింది. ఇప్పటికీ ఈమెకు వరుసగా ఆఫర్లు ఇచ్చేందుకు మేకర్స్ సిద్దంగా ఉన్నారు. కాని అనుష్క మాత్రం ఆచితూచి అడుగులు వేస్తుంది. ప్రస్తుతం ఈమె నిశబ్దం చిత్రం తో నటిస్తుంది. అయితే కరోనా లాక్డౌన్ కారణంగా ఈ చిత్రం విడుదల వాయిదా పడింది.