టాలీవుడ్ వివాదం కొత్త మలుపులు తిరుగుతోంది. ఇటీవల సినీ పెద్దలు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తో సమావేశమైన సంగతి తెలిసిందే. దీనికి తనను ఆహ్వానించలేదని బాలయ్య ఘాటుగా కామెంట్లు చేసిన సంగతీ తెలిసిందే. బాలయ్య కామెంట్లతో ఒక్కసారిగా సీన్ వేడెక్కింది. ఇక దీని తర్వాత ఈ వివాదంలోకి నాగబాబు ఎంటర్ కావడంతో సీన్ చినిగి చేటంతయ్యింది.

 

 

ఇప్పుడు ఈ వివాదంలోకి ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇస్తున్నారు. బాలయ్య కామెంట్లపై సినీ నిర్మాత కల్యాణ్ స్పందిస్తూ... మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ బాలకృష్ణను కూడా సమావేశాలకు పిలిచి ఉండాల్సిందని కామెంట్ చేశారు. దీంతో ఇప్పుడు మా అసోసియేషన్ తరపు నుంచి కూడా సీన్ లోకి కొందరు ఎంట్రీ ఇస్తున్నారు. మా అధ్యక్షుడు నరేశ్ ఈ కామెంట్‌లకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. అదేంటంటే.. అసలు మా అధ్యక్షుడిని నన్నే ఆ సమావేశాలకు పిలవలేదని బాంబు పేల్చేశాడు.

 

 

తననే కాదు.. మా సెక్రటరీని కూడా ఈ సమావేశాలకు పిలవలేదని నరేశ్ అంటున్నాడు. అసలు మమ్మల్నే పిలవనప్పుడు ఇంకా మేం ఎవరిని పిలుస్తాం అంటూ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించారు. దీంతో ఈ వివాదం ఇంకాస్త మలుపు తిరిగింది. అసలు చిరంజీవి అధ్యక్షత జరిగిన సమావేశానికి ప్రాతిపదిక ఏంటన్న విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.

 

 

అసలు ఈ సమావేశం నిర్ణయించింది ఎవరు.. వారు కొందరిని మాత్రమే ఎందుకు పిలిచారు. ఏ ప్రాతిపదికన పిలిచారు అన్న అంశంపై రచ్చ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అసలు తెలంగాణ మంత్రితో జరిగే సమావేశం..అదేదో సొంత వ్యవహారం లాగా చిరంజీవి ఇంట్లో నిర్వహించడం ఏంటన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఏం చేసినా ఇండస్ట్రీ మంచి కోసమే చేసినప్పుడు అనవసరంగా ఈ మీటింగ్ పై బురద జల్లడమేంటనే వారూ ఉన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: