యువ హీరో శర్వానంద్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీ కెరీర్ స్టార్ చేసి ఇప్పుడు హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. విభిన్నమైన చిత్రాలను సెలెక్ట్ చేసుకుంటూ వరుస సినిమాతో దూసుకుపోతున్నాడు. 'గమ్యం' 'ప్రస్థానం' 'అందరి బంధువయా' 'రన్ రాజా రన్' 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' 'ఎక్సప్రెస్ రాజా' 'శతమానం భవతి' 'మహానుభావుడు' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అయితే కొంతకాలంగా శర్వానంద్ వరుస పరాజయాలను ఎదుర్కుంటూ వస్తున్నాడు. 'పడి పడి లేచే మనసు' 'రణ రంగం' 'జాను' చిత్రాలు ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో తదుపరి సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు శర్వా. ఈ నేపథ్యంలో 'శ్రీకారం' అనే సినిమాకి శ్రీకారం చుట్టాడు. ఈ చిత్రానికి కిషోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా 14 రీల్స్ రామ్ ఆచంట - గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు.
ఇప్పటికి వరకు రిలీజైన ప్రచార చిత్రాలను బట్టి ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే రైతులు - వ్యవసాయం నేపథ్యంలో ఉండబోతోందని అర్థం అవుతోంది. దాదాపుగా చిత్రీకరణ చివరి దశకు వచ్చిన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. అయితే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు హీరోతో పాటు సాంకేతిక నిపుణుల వివరాలు తెలియజేసినప్పటికీ హీరోయిన్ ని మాత్రం ఇంట్రడ్యూస్ చేయలేదు. ఈ 'శ్రీకారం'లో హీరోయిన్ గా 'గ్యాంగ్ లీడర్' ఫేమ్ ప్రియాంక మోహన్ నటిస్తోందని ఎంతమందికి తెలుసు చెప్పండి. నిజానికి చాలా తక్కువ మందికి మాత్రమే ఆ అమ్మడు ఈ సినిమాలో హీరోయిన్ అని తెలుసు. అయితే ఎందుకు ఈ బ్యూటీ ఇందులో నటిస్తోందని బయటకు చెప్పడం లేదనే ప్రశ్న అందరిలో కలుగుతోంది. ఈ సినిమాలో ప్రియాంక క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందట.. అందుకే కొత్తగా ప్రమోట్ చేయడానికి ఏదో ప్లాన్ చేస్టున్నారట ఈ సినిమా టీమ్. పాపం.. ప్రియాంక కు ఈ సినిమాతో అయినా సరైన గుర్తింపు వస్తుందని భావించింది. కానీ ఇప్పుడు అమ్మడి పేరు కూడా ఇంత వరకు ఆఫీసియల్ గా ప్రకటించలేదు.