రామ్ గోపాల్ వర్మ అంటే వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన ఏ సినిమా తీసినా, ఏం మాట్లాడినా ఏం మాట్లాడకపోయినా సంచలనమే. కాగా ఇటీవల 'ఆర్జీవీ వరల్డ్ యాప్’ 'ఓటీటీ ప్లాట్ఫామ్స్ల హవా వంటి విషయాలపై రామ్గోపాల్వర్మ మాట్లాడారు. ఈ సందర్భంగా తన అభిరుచికి తగ్గట్టే ఆర్జీవీ వరల్డ్ లో సినిమాలు ఉంటాయన్నారు. సినిమాలతో ప్రతి ఒక్కర్నీ సంతృప్తిపరచాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. ఇంటిల్లిపాదీ చూడదగ్గ చిత్రాలు తాను తీయనని ఆర్జీవీ తెగేసి చెప్పారు. ఇంట్లో ఒక్కొక్కరు వేర్వేరు గదుల్లో ఒంటరిగా చూసే సినిమాలే తీస్మానని వర్మ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ఫామ్స్ హల్చల్ చేస్తున్న నేపథ్యంలో 'ఆర్జీవీ వరల్డ్' అనే యాప్ ను సిద్ధం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ‘క్లైమాక్స్’ చిత్రం ఈ యాప్లో విడుదల అవుతుందని తెలిపారు.
సినిమాలకు సంబంధించి సమాజంలో చోటు చేసుకుంటున్న మార్పుల గురించి ఆయన వివరించారు. నాటకాల నుంచి సినిమాలు, బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ సినిమాలు వచ్చా యన్నారు. అలాగే నాలుగేళ్ల నుంచి వెబ్ సిరీస్ అనే మాట వినిపిస్తోందన్నారు. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ సమాంత ఇండస్ట్రీ అయిందన్నారు. నెట్ ఫ్లిక్స్, అమెజాన్వంటి డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ లో వ్యూయర్షిప్ పెరుగుతుందంటే ప్రేక్షకులు చూస్తున్నారనే కదా అని వర్మ ప్రశ్నించారు. ఇండస్ట్రీలో 90శాతం ఫ్లాప్లు ఉంటాయని.. మొబైల్ లో థియేటర్లో సినిమా చూసే ఫీల్ను పక్కన పెడితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ వల్ల పబ్లిసిటీ ఖర్చు తగ్గుతుందన్నారు. కొందరు నిర్మాతలకు ఇది లాభమే అన్నారు.
అలాగే భవిష్యత్ లో సినిమా అంటే కనీసం రెండు గంటల నిడివి ఉండాలన్న నిబంధన ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఉండదన్నారు. తన ‘క్లైమాక్స్’ సినిమా నిడివి 55 నిమిషాలు మాత్రమే అని వర్మ చెప్పుకొచ్చారు. ‘ఆర్జీవీ వరల్డ్’ ఐడియా తనకు ఎప్పటి నుంచో ఉందన్నారు. చూసిన ప్రతిసారీ చార్జ్ చేస్తామన్నారు. తాను తీసిన ఫస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘కరోనా వైరస్’ అని తెలిపారు. ఈ సినిమాకు అగస్త్య మంజు డైరెక్టర్ అని.. ఆలోచన మాత్రం తనదని చెప్పుకొచ్చారు. ఈ సినిమా ఓటీటీలోనే విడుదలవుతుందన్నారు. ఎందరో పోర్న్స్టార్స్ ఉన్నప్పటికీ ‘జీఎస్టీ’ ‘క్లైమాక్స్’ కోసం మియా మాల్కొవానే ఎందుకు తీసుకున్నానంటే ఆ అమ్మాయి అంటే తనకిష్టమని వర్మ వెల్లడించారు. ‘ఎంటర్ ద గాళ్ డ్రాగన్’ చిత్రం షూటింగ్ ఇంకా నాలుగు రోజులు చేయాల్సి ఉందన్నారు.