దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో చితపరిశ్రమ మూతపడింది. థియేటర్స్ మల్టీప్లెక్సెస్ లు క్లోజ్ అయ్యాయి. సినిమాల షూటింగులు నిలిచిపోయాయి. దీంతో ఫైనాన్షియర్ల దగ్గర నుంచి తెచ్చిన డబ్బుకు వడ్డీలు కట్టలేని ప‌రిస్థితుల‌లో నిర్మాత‌లు త‌మ చిత్రాల‌ని డిజిటల్ ప్లాట్‌ ఫార్మ్ లలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా లాక్‌ డౌన్‌ సమయాన్ని క్యాష్‌ చేసుకునేందుకు ఓటీటీ సంస్థలు శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. విడుదలకు సిద్దంగా ఉండి లాక్‌ డౌన్‌ తో విడుదల కాకుండా ఆగిపోయిన చిత్రాలకు ఆకర్షణీయమైన ప్యాకేజీలు ఇవ్వడానికి ఓటీటీ సంస్థలు సిద్దమవుతున్నాయి. ఓటిటీ వేదికగా సినిమాలు విడుదల చేయడం సినిమా ప్రియులకు ఆనందకరమే కానీ నిర్మాతలకు మాత్రం ఇది లాభదాయకం కాదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కంటెంట్ నిజంగా బ్రహ్మాండంగా వుంటే జనం ఎగబడి చూస్తారు. ఫలానా సినిమా చూడమంటూ పదిమందికి చెప్తారు. అదే సినిమా అంతంతమాత్రంగా ఉన్నట్టయితే ఓటిటీలో ఫ్రీగా చూడ్డానికి కూడా జనం అంతగా ఇష్టపడరు.

 

ఇప్పటికే తెలుగులో ‘అమృతరామమ్’ సినిమా నేరుగా ఓటీటీలో విడుద‌ల అయింది. తమిళం నుంచి విడుదలైన జ్యోతిక సినిమా పోన్మగల్ వందాల్ కి ప్రచారం విపరీతంగా జరిగింది. విడుదలకి ముందు చాలా వివాదాలు కూడా సినిమాను వార్తల్లో ఉంచాయి. సూర్య నిర్మాత కావడం మరో పబ్లిసిటీ. అయితే ఇంత ప్రచారం పొందిన ఆ సినిమాలో కంటెంట్ లేకపోవడంతో చూసినవాళ్లు పెదవి విరిచారు. విమర్శకులు కూడా మెచ్చుకోలేదు. దీంతో ఆ చిత్రానికి అంతగా ఆదరణ లేదు. చిన్న సినిమా కనుక ఓటిటీ ఇచ్చిన అమౌంట్ ఓకే అయి ఉండొచ్చు. కానీ పెద్ద సినిమాలకు వ్యూస్ కూడా చాలా అవసరం. అదీగాక నెట్ లో సినిమా పెడితే పైరేట్స్ చేతిలో ఫుల్ హెచ్ డి ప్రింట్ పెట్టినట్టే. ఫలానా ఓటిటీలో ఉంది కదా అని జనం దానికి సబ్స్క్రయిబ్ చేసుకోరు. డౌన్లోడ్ చేసుకుని చూస్తారు. అప్పుడు సదరు వ్యూస్ కౌంట్ లోకి రావు. ఇన్నిరకాల తలనొప్పులు ఉండడంతో కోట్ల పెట్టుబడి పెట్టిన సినిమాని బొమ్మల పెట్టెలో చూపించడానికి నిర్మాతలు ఇష్టపడడం లేదు. ఆలస్యమయినా కానీ థియేటర్లు ఓపెన్ అయ్యాక విడుదల చేసుకుందాం అని వేచి చూస్తున్నారు. ఇప్పటికే ఓటీటీ విడుదలకు సిద్ధమైన సినిమాల పరిస్థితిని బట్టి మరికొంతమంది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: