టాలీవుడ్ లో ప్రస్తుతం చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉన్న యువ హీరో నాగ శౌర్య. 'ఊహలు గుసగుసలాడే' 'కల్యాణ వైభోగమే' 'దిక్కులు చూడకు రామయ్యా' 'ఛలో' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ మాస్ ఇమేజ్ కోసం ట్రై చేసి యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలలో నటించి ప్లాప్స్ ఎదుర్కున్నాడు. అయితే యూత్‌ హీరోగా ముఖ్యంగా అమ్మాయిల్లో ఫుల్‌ ఫాలోయింగ్‌ ఉన్న ఈ యంగ్‌ అండ్‌ ట్యాలెంటెడ్‌ హీరోకు హిట్టు పడి చాలా కాలమే అయింది. అయినా పట్టు విడువకుండా మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తూ ఈ ఏడాది ప్రారంభంలో 'అశ్వథ్థామ' అనే సినిమాను తనే స్వయంగా నిర్మించాడు. ప్రస్తుతం సమాజంలో స్త్రీలపట్ల కొనసాగుతున్న దారుణాలను చూసి చలించిన నాగ శౌర్య స్వయంగా రాసుకున్న యాక్షన్ అండ్ సస్పెన్స్ కథతో తెరకెక్కింది 'అశ్వథ్థామ'. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది. ఈ నేప‌థ్యంలో శౌర్య వరుస పెట్టి కొత్త సినిమాల‌కి కూడా సైన్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాడ‌ట. 

 

ఈ క్రమంలో మహిళా దర్శకురాలు లక్ష్మీ సౌజన్య తెరకెక్కిస్తున్న ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. దీంతో పాటు మహేష్ కోనేరు నిర్మాణ సారథ్యంలో ఓ సినిమా చేస్తున్నాడు. అంతేకాకుండా 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో తనకు లైఫ్ ఇచ్చిన అవ‌స‌రాల శ్రీనివాస్ డైరెక్ష‌న్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇంతక ముందే ఆగిపోయిందనే టాక్ వచ్చిన నేపథ్యంలో నిర్మాతలు ఈ విషయాన్ని ఖండించారు. ఇప్పుడు తాజాగా నాగ శౌర్య మరో కొత్త ప్రాజెక్ట్ ఓకే చేసాడని వార్తలు వస్తున్నాయి. 'అప్పట్లో ఒకడుండేవాడు' సినిమా డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా శౌర్య కమిట్ అయ్యాడని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. శ్రీ విష్ణు - నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు విమర్శకుల ప్రసంశలు సైతం దక్కించుకుంది. మరి ఇప్పుడు సాగర్ కె చంద్ర శౌర్యతో ఎలాంటి నేపథ్యం ఉన్న స్టోరీని తెరకెక్కించబోతున్నాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: