ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారితో విల విలలాడుతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ కరోనా కష్టాలు పడుతున్నవారే. కరోనా దెబ్బ ఎక్కువగా సినీ పరిశ్రమపై పడింది. కరోనా వల్ల సినిమా షూటింగ్స్, రిలీజ్ అన్నీ వాయిదాలు పడ్డాయి. మాల్స్, థియేటర్లు పూర్తిగా క్లోజ్ చేయడంతో ఇప్పట్లో థియేటర్లో సినిమాలు చూసే అదృష్టం ఉందో లేదో తెలియదు. దాంతో ఇప్పుడు సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న వారు ఓటీటీలో విడుదల చేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్తో చిన్నసినిమాలే కాక పెద్ద సినిమాలు కూడా స్ట్రీమింగ్ ప్లాట్ఫాంల వైపు అడుగులేస్తున్నాయి. ఇప్పటికే పలు భాషలకి సంబంధించిన చాలా సినిమాలు ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధం కాగా, పురుచ్చతలైవి జయలలిత జీవిత నేపథ్యంలో తెరకెక్కుతున్న తలైవీ కూడా ఓటీటీ బాట పడుతుందని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది.
తాజాగా దీనిపై బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ స్పందించింది. కంగనా ప్రధాన పాత్రలో ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న తలైవీ మూవీ ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకోగా, లాక్డౌన్ తర్వాత మిగతా భాగాన్ని పూర్తి చేయనున్నారు. ఓటీటీలో డైరెక్ట్గా విడుదల అవుతుందని వస్తున్న వార్తలని కంగనా రనౌత్ ఖండించారు. భారీ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న తలైవీ చిత్రాన్ని డిజిటల్ ప్లాట్ఫాంలలో రిలీజ్ చేయడం మంచి పద్దతి కాదని.. కొంత మంది సెంటిమెంట్ కూడా దెబ్బతినే ఆస్కారం ఉందనని అన్నారు.
మల్టీ లాంగ్వేజ్ లో మూవీగా తెరకెక్కుతున్నది.. ఈ సినిమా హిందీ,తమిళ భాషలకి గాను అమెజాన్, నెట్ఫ్లిక్స్ రూ. 55 కోట్లకి సొంతం చేసుకున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే.. డిజిటల్ స్పేస్లో విడుదలైన మణికర్ణిక, పంగా, జడ్జిమెంటల్ హై క్యా చిత్రాలు స్ట్రీమింగ్ ప్లాట్ఫాంల ద్వారానే పెట్టిన ఖర్చుని తిరిగి పొందాయి అని కంగనా గుర్తు చేసింది. తలైవీ చిత్రంలో ఎంజీఆర్గా అరవింద్ స్వామి కనిపించనున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల కానున్న ఈ సినిమాని విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.