చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ఇప్పుడు మనుషు ప్రాణాలకు గండంగా మారింది. ఇప్పటికే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అరకోటిని దాటిపోగా.. మరణాల సంఖ్య ఏకంగా 4లక్షల మార్క్ను చేరుకుంది. చైనా తర్వాత స్పెయిన్, ఇటలీ, యూకే, ఫ్రాన్స్ను దారుణంగా దెబ్బతీసిన కరోనా ఆ తర్వాత అమెరికాను దెబ్బతీసింది. ఇక భారత్లో 6,873 మంది మరణించారు. శనివారం వరకు 2.8% మరణాల రేటు ఉంది. అయితే కరోనా వల్ల మార్చి 24 నుంచి లాక్ డౌన్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అప్పటి నుంచి సినీ పరిశ్రమ పూర్తిగా షట్ డౌన్ అయ్యింది. దాంతో వేలాది మంది సినీ కార్మికులు, చిన్న నటులు కష్టాల పాలయ్యారు.
సినీ పరిశ్రమ పెద్దల నుంచి అంతంత మాత్రం సాయం అందుతున్నా.. చేతిలో పనిలేక ఎంతో మంది కన్నీటి పర్యంతం అవుతున్నారు. ముంబయి, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో టీవీ నటులు షూటింగులు లేక, చేతిలో డబ్బుల్లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. కొందరేమో కరోనా సోకి మృతిచెందుతున్నారు. తాజాగా తమిళనాడులోని చెన్నైలో టీవీ సీరియల్స్లో నటించే అన్నాచెల్లెళ్లు శ్రీధర్, జయ కళ్యాణి ఆత్మహత్య చేసుకున్నారు. కొన్ని రోజుల నుంచి వారి ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకపోవడం.. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి డోర్ పగలగొట్టి చూడగా, అందులో అన్నాచెల్లెళ్ల మృతదేహాలు కుళ్లిన స్థితిలో దర్శనమిచ్చాయి.
కాగా, చెన్నైలోని కొడంగయ్యూర్లో ఉన్న వారి ఇంట్లోనే వారు ఆత్మహత్య చేసుకుని కొన్ని రోజులు అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా లాక్ డౌన్ సడలించిన విషయం తెలిసిందే. సామాజిక దూరం పాటిస్తూ ఎవరి పనులు వారు చేసుకోవొచ్చిన కేంద్రం ప్రకటించింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్టాన్లీ ఆసుపత్రికి తరలించారు. వారు ఆత్మహత్య చేసుకున్నట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.