తమిళనాడులో జయలలిత, కరుణానిధి మరణాల తర్వాత రాష్ట్రంలో బలమైన నేతలు రాష్ట్రంలో లేరని అక్కడి ప్రజలు భావిస్తున్న విషయం తెలిసిందే. ఈవిషయాన్ని పలు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా బాహాటంగానే చెబుతున్నారు. ఈక్రమంలోనే రాజకీయాల్లోకి తమ ఎంట్రీని దక్షిణాది అగ్రహీరోలైన కమల్హాసన్, సూపర్స్టార్ రజనీకాంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అటు కమల్హాసన్గాని..ఇటు రజనీకాంత్గాని అనుకున్న స్థాయిలో ప్రజల మనస్సును చూరగొనలేకపోతున్నారనే అభిప్రాయం విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై ఒకప్పటి అగ్ర తార, కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న ఖుష్బు తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు. ఇటీవల ఆమె ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యవూలో రజినీకాంత్, కమల్హాసన్ రాజకీయ ప్రవేశంపై మాట్లాడారు. వాస్తవానికి కరుణానిధి, జయలలిత మరణాలు తర్వాత తమిళనాట రాజకీయాల్లో లోటు ఏర్పడిందని అన్నారు. ‘‘రజనీకాంత్ రాజకీయాల్లో కింగ్ కావాలనే జనాలు కోరుకుంటు న్నారు..కింగ్ మేకర్గా ఉండటం ఆయన అభిమానులకు, జనాలకు ఇష్టం లేదని చెప్పడం గమనార్హం. సినిమాలు వేరు..రాజకీయాలు వేరు అన్నది వాస్తవం. ఆ విషయం ఇద్దరు అగ్ర హీరోలు తెలుసు. వారు ఇద్దరూ కూడా ఎంతో సామాజిక పరిజ్ఞానం, స్పృహా, మంచి ఆలోచనలు, సామాజిక బాధ్యతలు ఎరిగిన వారై ఉంటారని నా అభిప్రాయం.
అయితే వారిని ప్రజలు విశ్వసించేలా నిర్ణయాలు..ఆచరణలు ఉండాలి. అప్పుడే రాజకీయాల్లోనూ వారు నిలదొక్కుకోగలరు అంటూ వ్యాఖ్యనించింది. ప్రజలు, రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఎవరికీ తెలియదు. త్వరలోనే ఆయన తన రాజకీయ పార్టీని ప్రారంభిస్తారని నేను ఆశిస్తున్నాను. ఆయన నిర్ణయంపై చాలా మంది రాజకీయ నాయకులతో పాటు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్న విషయం మాత్రం నిజం. అలాగే కమల్హాసన్ కూడా గత లోక్సభ ఎన్నికల్లో బాగానే రాణించారు. రాజకీయాల్లో ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పలేం. ప్రజల విశ్వాసం చూరగొన్నవారికే మద్దతు లభిస్తందున్నది వాస్తవం. ఈ ఇద్దరి హీరోల విషయంలోనూ అదే జరుగుతుందని పేర్కొన్నారు.