దేశంలో కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి లాక్ డౌన్ ప్రకటించారు. దాంతో వలస కార్మికులు ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ మద్య వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లొచ్చు అని కేంద్రం ప్రకటించిన తర్వాత శ్రామిక్ రైళ్లలో, ఇతర బస్సు సౌకర్యాలలో వలస కార్మికులు వెళ్తున్నారు. అయితే చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఉన్నవారికి నేనున్నా అంటూ ముందుకు వచ్చాడు బాలీవుడ్ నటుడు సోనూసూద్. ఎంతో మంది వలస కార్మికులను తన సొంత ఖర్చుతో బస్సుల్లో పంపారు. ఫ్లైట్ కూడా ఏర్పాటు చేసి వారి గమ్యస్థానాలకు పంపారు. ముంబైలో చిక్కుకున్న వలస కార్మికులకు ఏర్పాట్లు చేస్తూ ఫిల్మ్స్టార్ సోనూ సూద్ అందరి ప్రశంసలు పొందుతున్న విషయం తెలిసిందే. అయితే బాంద్రా రైల్వే స్టేషన్లో వలస కూలీలను కలిసేందుకు వెళ్లిన సోనూసూద్కు చేదు అనుభవం ఎదురైంది.
హీరో సోనూ సూద్ను రైల్వే పోలీసులు అడ్డుకున్నట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. సొంత డబ్బులతో ఆహారం, మాస్కులు తదితరాలను అందజేయడమే కాకుండా... ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి ఎంతో మందిని వారి స్వస్థలాలకు పంపిస్తున్న సోనూ సూద్ పై కోట్ల మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాంటి వ్యక్తిని ఎలా అవమానిస్తారంటూ విమర్శలు మొదలయ్యాయి. ఈ ఘటనపై ముంబై పోలీసులు వివరణ ఇచ్చారు.
అయితే ఈ ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. అయితే ఆ హీరోను ఆర్పీఎఫ్ దళాలు అడ్డుకున్నాయని, తాము కాదు అని ముంబై నిర్మల్ నగర్ పోలీసు స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ శశికాంత్ భంద్రే తెలిపారు. మరోవైపు సోనూ సూద్ చేస్తున్న సేవ కార్యక్రమాలను శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తప్పుపట్టారు. ఆదివారం రాత్రి సీఎం ఉద్దవ్ను సోనూ సూద్ కలిశారు. రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.. హీరో సోనూ సూద్కు అండగా నిలిచారు.