భీష్మ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నితిన్, రంగ్ దే చిత్రంతో పాటు మరో సినిమా కూడా చేస్తున్నాడు. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న అంధాధున్ రీమేక్ హక్కుల్ని కొనుక్కున్నాడు. ఆయుష్మాన్ ఖురానా నటించిన పాత్రలో తెలుగు ప్రేక్షకులకి ఆనందం పంచడానికి మన ముందుకు రాబోతున్నాడు. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన అంధాధున్ చిత్రంలో కీలక పాత్రలో టబు, రాధికా ఆప్టే కనిపించారు.

 

అయితే ఈ సినిమా తెలుగు రీమేక్ లో ఈ రెండు పాత్రల్లో ఇంకా ఎవరినీ తీసుకోలేదు. ఈ పాత్రలకి ఎవరి సెట్ అవుతారనే విషయమై తర్జన భర్జన పడుతున్నారు. ఈ రెండు పాత్రలు కొద్దిగా బోల్డ్ గా ఉండడంతో ఆ పాత్రలని ఒప్పుకునే వారెవరా అని వెతుకుతున్నారు. టబు పాత్రలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టిని తీసుకున్నట్లు సమాచారం. శిల్పాశెట్టి ఆ పాత్రలో చేయడానికి పాజిటివ్ గా స్పందించడంతో ఓకే అయిందనే అంటున్నారు.

 

ఇక మిగిలింది రాధికా ఆప్టే పాత్ర. మొదటగా ఈ పాత్రలో ప్రియాంకా మోహన్ ని అనుకున్నారట. కానీ ఏమైందో ఏమో మళ్ళీ సడెన్ గా ఈ పాత్ర కోసం ఇస్మార్ట్ భామ నభా నటేష్ ని అడిగారని సమాచారం. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నభా నటేష్, అటు గ్లామర్ పరంగానూ, నటన పరంగానూ మంచి మార్కులు తెచ్చుకుంది. అందుకే నితిన్ తో అంధాధున్ తెలుగు రీమేక్ లో నటించడానికి నభా నటేష్ ని అడుగుతున్నారట.

 

మరి ఈ రీమేక్ లో నటించడానికి నభా ఒప్పుకుంటుందా లేదా చూడాలి. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా, క్రిష్ణార్జున్ యుద్ధం వంటి సినిమాల ద్వారా ఆకట్టుకున్న మేర్లపాక గాంధీ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. నితిన్ ఫ్యామిలీ బ్యానర్ అయిన శ్రేష్ఠ్ మూవీస్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: