తనకు నచ్చిన సినిమా దర్శకులతో మళ్లీమళ్లీ సినిమాలు చేస్తుంటాడు కోలీవుడ్ స్టార్ సూర్య. అవసరమైతే సీక్వెల్.. లేదంటే కొత్త చిత్రం చేసేందుకు సిద్ధంగా ఉంటాడు. తాజాగా మరోసారి ఓ దర్శకుడితో కలిసి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఆ ప్రాజెక్ట్ డిటైల్స్ ఇపుడు పరిశీలిస్తే.. 

 

ఒకసారి పనిచేసిన డైరెక్టర్స్ తో మరోసారి కలిసి పనిచేయడం సూర్య స్పెషాలిటీ. పలువురు ప్రముఖ దర్శకులతో సూర్య రెండు లేదా మూడు సార్లు కలిసి పనిచేశాడు. అలాంటి కాంబినేషన్స్ కూడా సూర్యకు బాగా కలిసొస్తున్నాయి. అందులో భాగంగా వరుసగా సింగం సిరీస్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో బాలా, గౌతమ్ మీనన్, ఏ ఆర్ మురుగదాస్, కే ఎస్.రవి కుమార్, హరి, కేవీ.ఆనంద్.. లాంటి దర్శకులతో మళ్లీమళ్లీ పనిచేశాడు. ఇప్పుడు.. 24లాంటి సైంటిఫిక్ చిత్రం అందించిన దర్శకుడు విక్రమ్ తో మరో సినిమా చేస్తున్నాడు. 

 

సూర్య-విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన 24.. టైమ్ ట్రావెలింగ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందింది. సూర్య ద్విపాత్రాభినయం చేసిన 24 అప్పట్లో ఘన విజయం అందుకుంది. ఆ సినిమాలో హీరోగా, విలన్ గా సూర్య నటనతో ఆకట్టుకున్నాడు. సమంత, నిత్యమీనన్ కథానాయికలుగా నటించారు. ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రూపొందించనున్నారు. గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న ఈ సీక్వెల్ గురించి.. దర్శకుడు విక్రమ్ కుమార్ క్లారిటీ ఇచ్చాడు. దాంతో కోలీవుడ్ వర్గాల్లో ఈ చిత్రంపై ఆసక్తి మొదలైంది. 

 

మంచి కథ, స్క్రీన్ ప్లే ఉంటే 24 సీక్వెల్ చేయాలని.. సూర్య, నేను ముందే నిర్ణయించుకున్నాం. ప్రస్తుతం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాను.. త్వరలోనే స్క్రిప్ట్ కంప్లీట్ చేసి సూర్యను కలుస్తాను అని విక్రమ్ ఓ సందర్భంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా.. చిత్రం త్వరలోనే విడుదల కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: