బాలీవుడ్ నటుడు, హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నిన్న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఓవైపు కరోనా మహమ్మారితో దేశం మొత్తం పోరాటం చేస్తున్న సమయంలో సుశాంత్ సింగ్ మరణం అందరినీ షాక్కు గురిచేసింది. ముంబైలోని తన నివాసంలో సుశాంత్ సింగ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన మృతిపై ప్రధాని నరేంద్రమోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఎంఎస్ ధోనీ' బయోగ్రఫీతో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన సుశాంత్ సింగ్ ఆత్మహత్య వెనక అసలు కారణం ఏమిటనేది ఇంకా తెలియలేదు.
అయితే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లాక్ డౌన్ నేపథ్యంలో బాంద్రాలోని తన నివాసంలో ఒంటరిగా ఉంటున్నాడని.. కొన్నిరోజులుగా అతను డిప్రెషన్ లోనే
ఉన్నాడని.. అందుకే ఉరేసుకుని చనిపోయినట్టు భావిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. కానీ, ఎంతో భవిష్యత్తు ఉన్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడం వెనుక అసలు మిస్టరీ ఏమిటనే దానిపై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఇదే సమయంలో సుశాంత్ మామ.. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, అతని మృతి వెనుక ఏదో కుట్ర ఉండవచ్చన్నారు. దీంతో సుశాంత్ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పోస్ట్మార్టం నివేదిక కీలకం కానుంది. అయితే ముంబై లోని జూహూ ఏరియాలో ఉన్న కూపర్ ఆస్పత్రిలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతదేహానికి పోస్ట్ మార్టం చేశారు. డెడ్ బాడీకి కరోనా టెస్టులు సైతం చేసి..ఫలితం నెగెటివ్ వచ్చినట్లు తెలిపారు. ఇక తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్, పోస్టుమార్టం రిపోర్టును వైద్యాధికారులు విడుదల చేయగా.. అందులో సుశాంత్ సింగ్ది ఆత్మహత్యే అని తేలింది. మెడకు ఉచ్చు గట్టిగా బిగుసుకోవడంతో, ఊపిరి ఆడక, నరాలు తెగి ఆయన మరణించినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో సుశాంత్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు..? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రజంట్ సుశాంత్ మృతదేహాన్ని కూపర్ హాస్పిటల్ మార్చురీలో ఉంచారు. ఈ రోజు సాయంత్రం సుశాంత్ అంత్యక్రియలు జరగనున్నట్టు తెలుస్తోంది.