ఎర్రచందనం స్మగ్లిగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్, రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ‘ఆర్య, ఆర్య 2’ చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్–దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోంది. ఈ చిత్రంలో బన్నీకి జోడిగా రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం మొదటి షెడ్యూల్లో అల్లు అర్జున్ పాల్గొనలేదు. రెండో షెడ్యూల్ నుంచి పాల్గొనాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో చిత్రీకరణలు ఆగిపోయాయి. అయితే తెలుగు రాష్ట్రాలు షూటింగ్లకు సడలింపులు ఇవ్వడంతో చిత్రీకరణ పట్టాలెక్కనుంది.
ఈ క్రమంలో రెగ్యులర్ షూటింగ్ను స్టార్ట్ చేయాలనుకుంటోందట ‘పుష్ప’ టీమ్. ప్రస్తుత పరిస్థితుల్లో 40 మందికి మించకుండా షూటింగ్లకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని ముఖ్యమైన సన్నివేశాలకు ఈ నిబంధన అడ్డుకానుండటంతో ఆలోపు పాటలను పూర్తి చేయాలని సుకుమార్ భావిస్తున్నారట. పాటల చిత్రీకరణ కోసం ఇండోర్లో సెట్టింగ్లను సిద్ధం చేయించే పనిలో దర్శకుడు ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే ట్యూన్స్ సిద్ధం చేసి ఉండటంతో తొలుత పాటల చిత్రీకరణకు ఇబ్బంది లేకుండా ఉందని సమాచారం.
వాస్తవానికి ఈ షెడ్యూల్లో మహబూబ్ నగర్ అడవుల్లో కొన్ని సన్నివేశాల్లో తెరకెక్కించాల్సి ఉంది. ఇందుకోసం సెట్ వేసేందుకు కూడా అక్కడ ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే లాక్డౌన్ కారణంగా సినిమా షెడ్యూల్లో చాలా మార్పులు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈసినిమాలో ఆరు నిముషాల సన్నివేశానికి సుకుమార్ ఆరుకోట్ల బడ్జెట్ను ఖర్చే చేయిస్తున్నారని తెలుస్తోంది. సినిమా మొత్తానికి ఆ సన్నివేశం హైలెట్ కానుందంట. అలాగే ఈ సినిమా కోసం దేవీ శ్రీ ప్రసాద్ ప్రత్యేక శ్రద్దను తీసుకొంటున్నట్టు సమాచారం. ఓవరాల్గా తెరపైన మళ్లీ రంగస్థలం లాంటి మ్యాజిక్ను చేసేందుకు సుకుమార్, అల్లు అర్జున్ కాంబో సిద్దమవుతున్నది.