దేశంలో ఈ మద్య టిక్ టాక్ తో ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు తెగ పాపులర్ అవుతున్నారు. కొంత మంది బుల్లితెర, వెండి తెరపై కూడా చోటు సంపాదిస్తున్నారు. ఇలా టిక్టాక్ ద్వారా తమిళనాడుకు చెందిన ‘రౌడీ బేబీ’గా సూర్య అలియాస్ సుబ్బులక్ష్మి బాగా పాపులారిటీ సంపాదించింది. ఎంతగా అంటే.. టిక్టాక్లో ఆమె ప్రదర్శనకు ముగ్ధులైన కొందరు ఆమెను ఇటీవల సింగపూర్కు ఆహ్వానించారు. లాక్ డౌన్ కి ముందుగా వెళ్లిన ఆమె సింగపూర్ లో మూడు నెలలుగా చిక్కిపోయింది. ఆమె ఇటీవల తిరిగి తమిళనాడు చేరుకుంది. విమానంలో కోయంబత్తూరు చేరుకున్న ఆమెను నిబంధనల ప్రకారం 14 రోజులు క్వారంటైన్కు తరలించాలని నిర్ణయించారు.
కానీ ఈ రౌడీ బేబీ మాత్రం క్వారంటైన్లోకి వెళ్లేందుకు అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. ఎవరికీ తెలియకుండా విమానాశ్రయంలో అధికారుల కళ్లు గప్పిన ఈ ‘రౌడీ బేబీ’ తిరుప్పూర్ అయ్యం పాళయంలోని ఇంటికి చేరుకుంది. ఇక అక్కడి నుంచి అధికారులకు కష్టాలు మొదలయ్యాయి. అయితే సుబ్బులక్ష్మి ప్రస్తుతం అద్దె ఇంటిలో ఉంటుంది.. వారందరికీ కామన్ బాత్రూమ్ కావడంతో ఇరుగుపొరుగు వారిలో టెన్షన్ మొదలైంది. దాంతో వారంతా అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆమె ఇంటికి చేరుకున్న వైద్యాధికారులను సుబ్బులక్ష్మి బెదిరించింది.
తాను క్వారంటైన్కు వెళ్లేది లేదని తెగేసి చెప్పింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని... తాను క్వారంటైన్ కి వెళ్లే ప్రసక్తే లేదని ససేమిరా అంటూ రాద్దాంతం చేసింది. ఇక లాభం లేదు.. ఆమెతో గొడవకంటే బుజ్జగించడమే బెటర్ అనుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది ఆమె అందాన్ని తెగ పొగిడారు.. టిక్ టాక్ రాణీ అంటూ పొగిడేశారు. అప్పుడు శాంతించిన సుబ్బలక్ష్మి కొన్ని డిమాండ్స్ పెట్టింది. అయితే, క్వారంటైన్లో తనకు ప్రత్యేక గది ఉండాలని, టిక్టాక్కు అనుమతి ఇవ్వాలని, తనకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలని ఆమె చేసిన డిమాండ్కు పోలీసులు, వైద్యాధికారులు అంగీకరించినట్లు సమాచారం.