ప్రస్తుతం పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఎన్నో సినిమాలు వస్తున్నాయి. అందులో కొన్ని హిట్ అయితే.. మరికొన్ని ఫట్ అవుతూ ఉంటాయి. అయితే కొన్ని మాత్రం మంచి మెసేజ్ ఇచ్చిపోతుంటాయి. అలాంటి సినిమాల్లో గోపిచంద్ హీరోగా వచ్చిన `పంతం` సినిమా కూడా ఒకటి. వరుస విజయాలతో దూసుకెళ్తున్న అందాల తార మెహ్రీన్ కౌర్ ఈ చిత్రంలో గోపిచంద్కు జతకట్టారు. కె.చక్రవర్తి దర్శకత్వంలో రూపోందిన ఈ సినిమా 2018లో విడుదలైంది.
అవినీతిలో కూరుకుపోయి అక్రమంగా ప్రజల సొమ్మును దోచుకునే రాజకీయ నాయకులు.. వాళ్ల దగ్గర నుంచి ఆ డబ్బును కాజేసి ప్రజలకు పంచేసే హీరో.. ఇలాంటి రాబిన్ హుడ్ సినిమాలు ఇప్పటి వరకూ చాలానే వచ్చాయి. ఇది కూడా ఆ కోవకు చెందిన సినిమానే. అయితే ఈ సినిమాను కొత్తగా చూపించాడు దర్శకుడు. ప్రభుత్వం ఏదైనా పాలించేది అవినీతే..చివరకు ప్రజలకు దక్కాల్సిన ఎక్స్ గ్రేషియాల్లోనూ అవినీతి చేస్తున్న తీరును ఎంతో చక్కగా ప్రజంట్ చేశాడు.
ఈ సినిమాలో అవినీతి సొమ్మును కాజేసిన మంత్రులను అందరినీ కోర్టు మెట్లు ఎక్కిస్తాడు హీరో. అంతే కాదు..వీరి పదవులు కూడా పోతాయి. ఈ క్రమంలోనే రాజకీయ నాయకులతో ఓ ఆట ఆడేసుకుంటారు గోపిచంద్. అయితే ఈ సినిమా కథ గతంలో వచ్చిన పలు సినిమాల తరహాలోనే సాగుతుంది. అయితే క్లైమాక్స్ లో వచ్చే సీన్లు..డైలాగ్ లు మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలాగే ప్రస్తుత పొలిటికల్ సిస్టమ్ లో ఉన్న అవినీతిని కళ్ళకు కట్టినట్లు చూపెట్టడమే కాకుండా..ఓటర్లు కూడా ఓట్లు అమ్ముకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని హెచ్చరించారు.
పొలిటికల్ సిస్టమ్ పై గోపీచంద్ చెప్పిన డైలాగ్ లు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. మాస్ యాక్షన్ రోల్లో తనకు తిరుగులేదని గోపిచంద్ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. రాబిన్ హుడ్ తరహా పాత్రలో పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు. యాక్షన్ సీన్స్లో మంచి ఈజ్ చూపించాడు.