అందాల తార అనుష్క శెట్టి.. గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన అనుష్క.. అందం, అభినయం, నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఎమ్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన అరుంధతి సినిమాతో అనుష్క కెరీర్ మొత్తం టర్న్ అయింది. ఇక ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో అనుష్క దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. ఈ సినిమా తర్వాత అనష్క నటించిన సినిమా భాగమతి.
యూవీ క్రియేషన్ బ్యానర్పై రూపొందిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు జి అశోక్. చంచల (అనుష్క) ఒక ఐఏఎస్ అధికారి. ఆమె తనకు కాబోయే భర్తను చంపిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తుంటుంది. ఐతే చంచల ఒకప్పుడు పీఏగా పని చేసిన మంత్రి అవినీతిని నిరూపించేందుకు సీబీఐ అధికారులు.. చంచల నుంచి సమాచారం రాబట్టాలని అనుకుంటారు. అందుకోసం ఆమెను జైలు నుంచి అటవీ ప్రాంతంలో ఉండే పాడుబడ్డ బంగ్లాకు తరలిస్తారు. ఆ బంగ్లాకు వెళ్లాక అనూహ్య పరిణామాలు జరుగుతాయి.
అవేంటి.. భాగమతి బంగ్లాగా పేరున్న దాని వెనుక కథేంటి..? ఇంతకీ చంచల తనకు కాబోయే భర్తను ఎందుకు చంపింది.. మంత్రి నిజంగా అవినీతి పరుడా.. చివరికి చంచల కేసు నుంచి బయటి పడిందా.. అన్నదే సినిమా. అయితే ఈ సినిమాలో భాగమతిగా అనుష్క అద్భుత నటన కనబరిచింది. ముఖ్యంగా ఈ సినిమాలో `ఎవడు పడితే వాడు రావడానికి.. ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డా? భాగమతి అడ్డా.. లెక్కలు తేలాలి.. ఒక్కడ్నీ పోనివ్వను' అంటూ అనుష్క చెప్పే డైలాగ్ మొత్తం సినిమాకే హైలైట్గా నిలిచింది. అనుష్క చెప్పిన ఈ డైలాగ్ అప్పట్లో తెగ వైరల్ అయ్యింది కూడా. సినిమాలో అనుష్క చెప్పే ఈ డైలాగ్ థియేటర్లో ప్రేక్షకుల చేత కేకలు పెట్టించింది. అలాంటి డైలాగ్ ఎన్ని సార్లు చూసినా.. చూడాలనిపిస్తుంది. ఎందుకంటే.. అంతలా అనుష్క ఆకట్టుకుందని చెప్పాలి.