ప్రస్తుతం ప్రపంచదేశాల ప్రజలు కరోనా అంటేనే భయపడిపోతున్నారు. గత ఏడాది డిసెంబరులో చైనాలోని వూహాన్ నగరంలో పుట్టుకొచ్చిన ఈ కరోనా భూతం రోజురోజుకు మరింత తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అయితే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నుంచి మానవాళిని రక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కరోనాకి విరుగుడుగా 140 వ్యాక్సిన్ల ట్రయల్స్ జరుగుతున్నాయి. కానీ, ప్రస్తుతానికి అయితే ఏ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాలేదు. దీంతో కరోనా కేసులు సంఖ్య, మరణాల సంఖ్య భారీ స్థాయిలో పెరుగుతున్నాయి.
కరోనా దెబ్బకు అటు ప్రజలు, ఇటు ప్రభుత్వాలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఇదిలా ఉంటే.. భారత్లోనూ కరోనా కేసులు రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం భారత్లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 548318కి చేరుకోగా.. మరణాల సంఖ్య 16475కి పెరిగింది. దీంతోప్రస్తుతం మొత్తం కేసుల్లో ఇండియా నాలుగో స్థానంలో ఉంది. అయితే ఇటీవల భారీ స్థాయిలో కరోనా కేసులు పెరుగుతుండడంతో.. తాజాగా దీనిపై సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదిక ఆందోళన వ్యక్తం చేశాడు.
ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ.. లాక్ డౌన్ సడలించడంతో.. కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని అన్నారు. ఇలాంటి సమయంలో మనల్ని మనం కాపాడుకోవడమే కాకుండా, మన చుట్టూ ఉన్నవాళ్లను కూడా కాపాడుకుందాం అంటూ మహేష్ పిలుపునిచ్చారు. బయటికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆయన సూచించారు. మరియు మీ చుట్టుపక్కల పరిస్థితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, భద్రతా చర్యలతో పాటు, భౌతికదూరం కూడా పాటించాలని మహేష్ చెప్పుకొచ్చాడు. అలాగే ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని స్పష్టం చేశారు.