పెళ్ళి చూపులు సినిమా ద్వారా న్యూ ఏజ్ రొమాంటిక్ సినిమా తీసి, మంచి విజయాన్ని దక్కించుకున్న తరుణ్ భాస్కర్ అందరికీ సుపరిచితుడే. దర్శకుడిగా ఇప్పటి వరకు రెండు సినిమాలు చేసిన తరుణ్, హీరోగానూ నటించాడు. విజయ్ దేవరకొండ నిర్మాతగా చేసిన మీకు మాత్రమే చెప్తా సినిమాతో హీరోగా లాంచ్ అయినప్పటికీ ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. అయితే ప్రస్తుతం తరుణ్ భాస్కర్ తో మహేష్ అభిమానులకి పెద్ద యుద్ధమే నడుస్తుంది.

 

 

స్టార్ హీరో అభిమానులతో కెలుక్కోవడం తరుణ్ కి ఇది రెండోసారి. గతంలో జనతా గ్యారేజి సినిమా విషయంలో మాట్లాడిన మాటలకి హర్ట్ అయిన ఎన్టీఆర్ అభిమానులు తరుణ్ ని విపరీతంగా ట్రోల్ చేసారు. ఇప్పుడు మహేష్ అభిమానులు కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ట్రోల్ చేయడానికి కారణం ఏంటని ఆలోచిస్తున్నారా..? అయితే ఈ మధ్య తరుణ్ భాస్కర్ మళయాల చిత్రమైన కప్పెల సినిమా చూసాడట.

 

 

ఆ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, ఈ సినిమాలో స్లో మోషన్ లొ వచ్చే ఫైట్ సీన్స్ ఉండవు. మాటి మాటికీ హీరో పెద్ద పెద్దగా అరుస్తూ డైలాగ్స్ చెప్పడు. ప్రతీ రెండు నిమిషాలకీ హీరో ఎంట్రి ఇవ్వడు. అదీగాక చివరి పదినిమిషాల్లో హీరో రైతుల గురించో, దేశం గురించో డైలాగులు చెప్పడు.. కానీ అలాంటి వాటిని కూడా అక్కడ సినిమా అనే పిలుస్తారు అని మెసేజ్ పెట్టాడు. 

 

ఈ మెసెజ్ ద్వారా తరుణ్ చాలా సినిమాల పైనే విమర్శలు చేసినప్పటికీ చివర్లో రైతుల గురించి, దేశం గురించి మాట్లాడడు అన్న మాటలు మహేష్ సినిమాలైన మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలని టార్గెట్ చేస్తూ అన్నట్లుగా ఉండడంతో మహేష్ ఫ్యాన్స్ అలర్ట్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా మహేష్ అభిమానులు తరుణ్ పై ట్రోలింగ్స్ చేస్తున్నారు. అయితే ఈ ట్రోలింగ్స్ కి తరుణ్ గట్టి సమాధానమే ఇచ్చారు. ఫేక్ ఐడీలతో ట్రోల్ చేసే వారికి తాను భయపడనని గట్టిగానే చెప్పాడు. తరుణ్, మహేష్ అభిమానుల మధ్య నడుస్తున్న ఈ ఫైట్ ఎక్కడిదాకా పోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: