హీరోయిన్ పూర్ణకు బెదిరింపుల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పూర్ణను వేధించిన గ్యాంగ్‌.. సినిమా ఆఫర్లతో నటీనటుల వివరాలు సేకరించి బ్లాక్ మెయిల్‌కు పాల్పడినట్లు విచారణలో తేలింది. ఐతే నిందితుడితో సంబంధాలు ఉన్నాయని ప్రచారం జరగడంతో... పూర్ణ వివరణ ఇచ్చారు. 

 

హీరోయిన్ పూర్ణకు బెదిరింపుల వ్యవహారంపై దుమారం కొనసాగుతోంది. తనను కొందరు దుండగులు డబ్బు డిమాండ్ చేస్తున్నారని, ఇవ్వకపోతే ప్రాణాలు తీస్తామని బెదిరిస్తున్నారని ఇటీవల ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.  దీంతో ఆమెను బెదిరించిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, విచారణ చేపట్టగా ఆసక్తికర విషయాలు బయటికి వస్తున్నాయి. అయితే ఈ కేసులో ఉన్న నిందితుడు, అతని వెనుక ఉన్న ముఠాతో పూర్ణకు సంబంధం ఉన్నట్లుగా వార్తలు రావడంతో.. వాటిపై వివరణ ఇస్తూ పూర్ణ ఓ లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

 

ఇలాంటి కష్ట సమయంలో తనకు అండగా నిలిచి, మద్దతు తెలిపిన స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలంటూ లేఖలో రాసింది హీరోయిన్ పూర్ణ.  ఈ కేసుకు సంబంధించి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. అందుకే ఈ లేఖ ద్వారా వాటికి క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాని చెప్పింది. ఈ బ్లాక్‌మెయిల్ కేసులోని నిందితుడితో కానీ,  వారి వెనుక ఉన్న ముఠాతో కానీ తనకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. దయచేసి విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి అవాస్తవాలను ప్రచారం చేయవద్దని వేడుకుంది. తనకు జరిగిన ఈ  ఘటనతో మిగతావారు మేల్కొంటారని, జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నానంటూ....  లేఖలో తెలిపింది హీరోయిన్ పూర్ణ. 

 

అసలేం జరిగిందంటే... సినీ నటి పూర్ణ ఇంటికి ఓ గ్యాంగ్ పెళ్లి సంబంధం పేరుతో వెళ్లింది. వారితో పరిచయం పెంచుకుంది. ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేయాలని భావించారు దుండగులు. పూర్ణను కిడ్నాప్ చేసి, ఒక హోటల్ గదిలో బంధించి పెద్ద ఎత్తున డబ్బు గుంజాలని ప్లాన్ వేశారు. ఆమె నుంచి లక్ష 50 వేల రూపాయలు డిమాండ్ చేశారు. ఇది విఫలం కావడంతో కిడ్నాప్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. పూర్ణ పోలీసులను ఆశ్రయించడంతో.. ఆ ముఠాకు సంబంధించిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: