భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం `కౌసల్య కృష్ణమూర్తి`. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కనా’ సినిమాను `కౌసల్య కృష్ణమూర్తి` పేరుతో కేఎ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, ఝాన్సీ, శివ కార్తీకేయన్, కార్తీక్ రాజు ముఖ్య ప్రాతలు పోషించారు. క్రికెట్ పురుషుల ఆట అని భావించే రోజుల్లో ఒక యువతి తన చిన్ననాటి కలని సాకారం చేసుకుని తండ్రి కళ్లల్లో ఆనందం చూసేందుకు ఏమి చేసింది అనే లైన్తో సినిమా తెరకెక్కింది.
ఓ మ్మాయి క్రికెటర్ గా ఎదిగే తీరు, రైతు పతనం రెండింటిని ఒకే కథలో ఇమిడ్చి.. చివర్లో ఇచ్చిన సందేశం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అలాగే ఓ సాధారణమైన అమ్మాయి, మారుమూల ప్రాంతంలో పుట్టిన అమ్మాయి జాతీయ స్థాయి క్రికెటర్ గా ఎదిగిన వైనం స్ఫూర్తిని ఇస్తుంది. కథలో కనిపించే ప్రతీ మలుపులో ఎమోషనల్ పాయింట్ను మిస్ కాకుండా రాసుకొన్న సన్నివేశాలు ఆద్యంత భావోద్వేనికి గురిచేయడమే కాకుండా, ఆలోచింప చేసేలా ఉంటాయి. ఇక ఏ పాత్రనైనా అలవోకగా తనదైన శైలిలో నటించి మెప్పించే రాజేంద్రప్రసాద్, కృష్ణమూర్తి పాత్రకు ప్రాణం పోశాడు.
పంట చేతికిరాక ఇబ్బంది పడే సగటు రైతుగా, కూతురు భవిష్యత్ గురించి బెంగతో భయపడే తండ్రిగా అద్భుతంగా నటించాడు. మరియు తాను అప్పుల్లో కూరుకుపోయి, రోడ్డున పడినా.. కూతురు విజయం కోసం ఆరటపడే తండ్రి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయి ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించారు. అలాగే యువ హీరోయిన్గా విభిన్నమైన పాత్రలతో తమిళ, తెలుగు రంగాల్లో ఆకట్టుకొంటున్న ఐశ్వర్య రాజేష్ కౌసల్యగా నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. నిజమైన క్రికెటర్ అనే అంతగా పాత్రలో లీనమైంది. అలాగే భావోద్వేగాలతో పాటు తండ్రీ కూతళ్ల సెంటిమెంట్ సినిమాకు హైలైట్ అని చెప్పుకోవచ్చు.