అందరికి సినిమాలు చూపించే సినిమా రంగాన్ని ఇప్పుడు కరోనా ఒక ఆట ఆడిస్తోంది. దీనితో కరోనా లాంటి విలన్ క్యారెక్టర్ ను గతంలో చిత్ర పరిశ్రమ ఎన్నడూ చూసి ఉండదు అంటూ కొందరు జోక్ చేస్తున్నారు. దీనితో సినిమా రంగం పై ఆధారపడి జీవిస్తున్న వారు మాత్రమే కాకుండా సినిమాలు తీసే భారీ నిర్మాతలు తమ సినిమాలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితులలో వడ్డీలు కట్టలేక ఆస్థులు అమ్ముకోలేక చిత్ర పరిశ్రమను ఈగండం నుండి ఎలా రక్షించాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు.
ఈవాస్తవాలను గుర్తించి తమిళ చిత్రపరిశ్రమను బతికించుకునేందుకు కోలీవుడ్ చిత్ర నిర్మాణ మండలి తేసుకున్న కఠిన నిర్ణయాలకు సంబంధించిన వార్తలు విని మన టాలీవుడ్ టాప్ హీరోలు తీవ్రంగా కలవర పడుతున్నట్లు టాక్. ప్రస్తుతం కరోనా సమస్యలు వల్ల ఆగిపోయిన సినిమాలతో పాటు త్వరలో మొదలు పెట్టబోతున్న సినిమాలకు సంబంధించి నటీనటులు సాంకేతిక నిపుణులకు ఇవ్వవలసిన పారితోషికాల్లో 50 శాతం కోత విధించాలనే కఠిన నిర్ణయం తమిళ చిత్రపరిశ్రమ నిర్మాతల మండలి తీసుకుంది.
ప్రస్తుతం లాక్ డౌన్ నుండి షూటింగ్ లకు మినహాయింపులు ఇచ్చినా తమిళనాడులో షూటింగ్ లకు హాజర్ కావడానికి నటీనటులు సాంకేతిక నిపుణులు ఇష్టపడని పరిస్థితులలో సినిమాలు నిర్మించే నిర్మాతలకు భారీనష్టాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో నటీనటులు తమ పారితోషికాలను 50 శాతం ఖచ్చితంగా సహకరించాలని అలా సహకరించని వారితో భవిష్యత్ లో సినిమాలు తీయకూడదని తమిళ చిత్రపరిశ్రమ కఠిన నిర్ణయాలు తీసుకుంది.
ఇప్పుడు ఈవిషయాలు టాలీవుడ్ ఇండస్ట్రీ నిర్మాతల వరకు చేరడంతో ఇలాంటి కఠిన నిర్ణయాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడ నిర్మాతల మండలి తీసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనలు రావడంతో ఇప్పుడు ఈవిషయమై తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలిలో కూడ లోతైన చర్చలు జరుగుతున్నట్లు టాక్. వాస్తవానికి ఇప్పటికే ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు ఒక మీడియా సంస్థకు ఈమధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి కూడ నటీనటులు సాంకేతిక నిపుణులు తమ పారితోషికాలు తగ్గించుకోకపోతే ఇక సినిమాలు తీయడం కష్టం అని ఓపెన్ గా చెప్పిన పరిస్థితులలో ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతల మండలి కోలీవుడ్ నిర్మాతల మండలి నిర్ణయాలను కఠినంగా అమలు చేయడం మొదలుపెడితే టాలీవుడ్ టాప్ హీరోలకు రానున్నది కష్టకాలమే అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..