రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యువ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్. నేడు ఉదయం ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. కొన్నేళ్ల క్రితం యూరోప్ లో జరిగిన ప్రేమకథగా పలు భారీ హంగులతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ఒకప్పటి బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ,ప్రభాస్ కు తల్లిగా నటిస్తుండగా ఈ సినిమాని తన గోపికృష్ణ మూవీస్ బ్యానర్ పై సమర్పిస్తుండడంతో పాటు సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు. 

IHG

మురళి శర్మ, ఎయిర్ టెల్ యాడ్ ద్వారా పాపులరైన షాషా ఛత్రి, సచిన్ ఖేడేకర్, కునాల్ రాయ్ కపూర్, ప్రియదర్శి సహా పలువురు ఇతర నటీనటులు నటిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ ఫోటోగ్రాఫర్ మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీని అందిస్తుండగా ఎడిటింగ్ ని కోటగిరి వెంకటేశ్వర రావు, విఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్ గా కమల్ కన్నన్ పనిచేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు అనేది మాత్రం నేడు నిర్మాతలు ప్రకటించలేదు. గతంలో ప్రభాస్, సుజీత్ ల కాంబోలో ఇదే యువి క్రియేషన్స్ బ్యానర్ పై వచ్చిన సాహో విషయంలో కూడా ఇలానే జరిగింది. ఆ సినిమాకు సంబంధించి కూడా అందరూ టెక్నీషియన్లు ముందుగా ఎంపిక కాబడ్డప్పటికీ, సంగీత దర్శకులను మాత్రం చాలా రోజుల తరువాత ఎంపిక చేసారు. 

 

అయితే ఆ తరువాత సినిమాకు ఎంపికైన శంకర్ ఎహసాన్ లాయ్ కొన్ని కారణాల వలన ఆ సినిమా నుండి తప్పుకోవడంతో చివరకు మరొక ముగ్గురు బాలీవుడ్ సంగీత దర్శకులతో సాంగ్స్ కంపోజ్ చేయించారు. అనంతరం రిలీజ్ అయిన సాహో సాంగ్స్ కు శ్రోతల నుండి ఆశించిన రేంజ్ స్పందన మాత్రం లభించలేదు. అదేవిధంగా ఇప్పుడు రాధేశ్యామ్ సినిమాకు కూడా సంగీతదర్శకుడిని నేడు ప్రకటించకపోవడంతో, సాహో మాదిరిగా చివరలో ఎవరో ఒకరిని ఎంపిక చేసి, హడావుడిగా సాంగ్స్ కంపోజ్  చేయించవద్దని పలువురు కోరుతున్నారు. అలానే వీలైనంత త్వరగా రాధేశ్యామ్ కు సంగీత దర్శకుడిని ఎంపిక చేసి శ్రోతలను అలరించే విధంగా సాంగ్స్ కంపోజ్ చేయిస్తే బాగుంటుందని పలువురు ప్రేక్షకులు, ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. మరి రాధేశ్యామ్ సంగీత దర్శకుడి విషయమై సినిమా యూనిట్ రాబోయే రోజుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: