దేశంలో కరోనా వైరస్ మార్చి నెలలో విజృంభించడం మొదలు పెట్టింది. దాంతో మార్చి 24 నుంచి లాక్ డౌన్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అప్పటి నుంచి రవాణా, వినోద, విద్యా వ్యవస్థలు అన్నీ షట్ డౌన్ అయ్యాయి. ఇక అత్యవసర వస్తువులకు మాత్రమే ప్రజలు బయటకు రావాలని ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దాంతో పేద ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. చిరు వ్యాపారులు, వలస కూలీల పరిస్థితి దారుణంగా తయారైంది. కొంత మంది సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన వారు సహాయం చేసినా.. కేవలం అది కంటి తుడుపు మాత్రంగానే మిగిలింది. వలస కూలీల కష్టాలు పరిగణలోకి తీసుకొని వారు తమ స్వస్థలాలకు వెళ్లవొచ్చని కేంద్రం ప్రకటించింది. అంతే కాదు వారికి శ్రామిక్ రైళ్ల ఏర్పాటు కూడా చేసింది. దాంతో దేశ వ్యాప్తంగా ఎంతో మంది తమ స్వస్థలాలకు వెళ్లారు.
ఈ క్రమంలోనే ఎన్నో కష్టాలు పడ్డారు. ఇక కరోనా సమయంలో ఆపదలో ఉన్న వారికి ఆపద్భాందవుడిగా నిలిచి అందరి మనసులలో చెరగని ముద్ర వేసుకున్నాడు సోనూ సూద్. కరోనా బాధితులను కాపాడుతున్న వైద్యుల కోసం హోటల్ కేటాయించిన సోనూ సూద్, వలస కార్మికులని వారి సొంత గ్రామాలకి తరలించేందుకు బస్సులు, రైళ్ళు, చార్టర్డ్ ఫ్లైట్స్ ఏర్పాటు చేసాడు. అంతే కాదు తన సొంత ఖర్చులతో వలస కార్మికుల బాధలను తీరుస్తూ వారికి కొండంత అండగా నిలిచాడు సోనూసూద్. ఇప్పుడు మరోసారి ఆయన మంచి మనసు చాటుకుంటున్నారు.
లాక్ డౌన్ సమయంలో వివిధ ప్రమాదాలలో మరణించిన లేదా గాయపడ్డ వలన కార్మికుల కుటుంబాలకి సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ సహా వివిధ రాష్ట్రాల అధికారులతో సంప్రదించి ప్రాణాలు కోల్పోయిన కార్మికులు, సంబంధిత సమాచారం చిరునామాలు, బ్యాంక్ వివరాలను తీసుకున్నారు. సుమారు 400 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొన్నారు సోనూ సూద్.