కీర్తి సురేష్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అతి తక్కువ సమయంలో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది ఈ ముద్దుగుమ్మ. 2000 మొదట్లో బాలనటిగా తెరంగేట్రం చేసిన కీర్తి.. ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం 2013లో విడుదలైన మలయాళం సినిమా గీతాంజలితో పూర్తి స్థాయి హీరోగా మారింది. ఇక తెలుగులో రామ్ హీరోగా తెరకెక్కిన `నేను శైలజ` సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. మొద్దటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది.
ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన `నేను లోకల్` సినిమాలో కూడా నటించి యూత్లో మంచి క్రేజ్ సంపాధించుకుంది. ఇక ఆ తర్వాత మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది కీర్తి సురేష్. పాతికేళ్ల వయసులోనే సూపర్ స్టార్ అయిపోయింది. సావిత్రి పాత్రకు ప్రాణం పోసి నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకుని ప్రశంసల వర్షం దక్కించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం కీర్తి మిస్ ఇండియా, నితిన్ రంగ్ దే, సర్కారు వారి పాటతో పాటు బాలీవుడ్లో కూడా సినిమాలు చేస్తుంది.
ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. అందమైన రూపం, అలరించే హావభావాలతో అందరినీ అలరించి, మెప్పించిన కీర్తి సోషల్ మీడియాలో అభిమానులను అలరించేందుకు ఎప్పటికప్పుడు తెగ హంగామా చేస్తుంటుంది. ఈ అమ్మడుకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్పై కూడా క్రేజ్ పీక్స్లో ఉందని చెప్పాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అవుతున్న వారి సంఖ్య 50 లక్షలను దాటేసింది. ఈ క్రమంలోనే ఇటీవల తనను ఫాలో అవుతున్న అభిమానుల కోసం మేకప్ లేకుండా తన పెట్ డాగ్ తో కలిసి ఫోటోషూట్ కూడా చేసింది. ఈ సందర్భంగా.. మనది ఇప్పుడు 50 లక్షల మందితో నిండిన కుటుంబమని, తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఎంతో సంతోషిస్తున్నానని కీర్తి చెప్పుకొచ్చింది.