టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ గతంలో మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో సింహా, లెజెండ్ సినిమాలు చేసారు. మంచి అంచనాలతో అప్పట్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ రెండు సినిమాలు కూడా ఒక దానిని మించి మరొకటి అద్భుత విజయాలు అందుకుని బాలయ్య, బోయపాటిల కాంబోకు విపరీతమైన క్రేజ్ ని తెచ్చిపెట్టాయి. ఇకపోతే లెజెండ్ తరువాత వీరిద్దరూ కలిసి ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై ప్రస్తుతం చేస్తున్న సినిమా షూటింగ్ ఇటీవల లాక్ డౌన్ కు ముందు రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. బాలయ్య రెండు పవర్ఫుల్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమా టైటిల్ ఇంకా నిర్ణయం కాలేదు. కాగా గత నెలలో బాలయ్య పుట్టినరోజు సందర్భముగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఆడియన్స్, నందమూరి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన స్పందను రాబట్టింది.
అతి త్వరలో తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఒక వార్త పలు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతోంది. వాస్తవానికి ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ హీరోకు ధీటుగా ఉండనుందని, కాగా ఆ రోల్ కు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ని తీసుకుంటున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే నేడు ప్రముఖ కోలీవుడ్ నటుడు శరత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నిర్మాతలైన ద్వారకా క్రియేషన్స్ వారు ఆయనకు తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు.
Wishing the versatile actor @realsarathkumar garu, a very Happy Birthday. Have a great year ahead💐#HBDSarathkumar pic.twitter.com/OYfiS75Ddg
— dwaraka Creations (@dwarakacreation) July 14, 2020
అయితే గతంలో ఇదే బ్యానర్ పై బోయపాటి దర్శకత్వంలో వచ్చిన జయజనకి నాయక సినిమాలో శరత్ కుమార్, హీరో తండ్రి పాత్రలో నటించడం, అలానే ఆ అనుబంధంతో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారని కొందరు అంటుంటే, అదేమీకాదు బాలయ్య సినిమాలో ఆయననే విలన్ గా ఎంపిక చేయడం వల్లనే నేడు వారు తమ మీడియా అకౌంట్స్ లో శరత్ కుమార్ కు శుభాకాంక్షలు తెలియచేస్తూ ప్రేక్షకులకు కొంత హిట్ ఇచ్చే విధంగా పోస్ట్ పెట్టారని అంటున్నారు. కాగా రెండేళ్లే క్రితం అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన నా పేరు సూర్య సినిమాలో శరత్ కుమార్, చల్లా అనే విలన్ పాత్రలో నటించి మంచి పేరు దక్కించుకొవడంతో, ఈ సినిమాలో ఆయన అయితే బాగుంటారని, విలన్ క్యారెక్టర్ కు దర్శకుడు బోయపాటి ఆయనను ఎంపిక చేసారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయో తెలియాలంటే మాత్రం, ఈ సినిమా యూనిట్ స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే.....!!