మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ `ఉప్పెన`. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్గా నటించగా.. విజయ్ సేతుపతి విలన్ పాత్ర పోషిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ పతాకాలపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కావాల్సి ఉంది. దానికి తగ్గట్లుగానే సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. కాని, కరోనా వైరస్ వల్ల ఈ చిత్రం విడుదల వాయిదాపడింది.
అయితే విడుదలకు ముందే ఈ చిత్రం రికార్డులు క్రియేట్ చేస్తోంది. ప్రమోషన్స్లో భాగంగా ఈ చిత్రం నుంచి ఇటీవల రెండు పాటలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు పాటలకు మంచి స్పందన లభించింది. అందులో ముఖ్యంగా ``నీ కన్ను నీలి సముద్రం.. నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం.. నీ నవ్వు ముత్యాల హారం.. నన్ను తీరానికి లాగేటి దారం దారం.. నల్లనైన ముంగురులే అల్లరేదో రేపాయిలే.. నువ్వు తప్ప నాకింక వేరే లోకాన్ని లేకుండా కప్పాయిలే`` అంటూ సాగే సాంగ్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. రెండు నెలలుగా ఈ పాట యూత్ ఫెవరెట్ సాంగ్ గా మారిపోయింది.
ఈ క్రమంలోనే యూట్యూబ్లో ఈ సాంగ్ ఓ రేంజ్లో దూసుకుపోతోంది. ఇప్పటికే 50 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని రికార్డు క్రియేట్ చేసింది. హీరో హీరోయిన్లు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి.. ఇద్దరికీ ఇదే తొలి చిత్రమైనప్పటికీ ఈ పాటలో వారు ప్రదర్శించిన హావభావాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ప్రస్తుతం ఈ పాట 86 మిలియన్ వ్యూస్ దగ్గర నిలిచింది. ఇదే జోరు కొనసాగితే.. మరికొన్ని రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్ దక్కించుకుని మరోసారి రికార్డు సృష్టించడం ఖాయం. కాగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా, జావెద్ అలీ ఈ పాట పాడారు. మరియు ఈ పాటకు శ్రీమణి అందించిన సాహిత్యం ఆకట్టుకోగా.. రక్వీబ్ ఆలమ్ హిందీ లిరిక్స్ మైమరిపిస్తున్నాయి.