ఈ మద్య కన్నడ హీరోలు తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. తెలుగు లో ఇప్పటి వరకు ఎంతో మంది కన్నడ నటులు ఎంట్రీ ఇచ్చినా.. అతి కొద్ది మంది మాత్రమే మంచి ఫామ్ లో కొనసాగారు. అలాంటి వారిలో ఉపేంద్ర ఒకరు.. ఆయన నటించిన చిత్రాలు తెలుగు లో మంచి విజయాలు సాధించాయి. రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ చిత్రంతో విలన్ గా కనిపించిన కిచ్చ సుదీప్ కన్నడ నాట మంచి స్టార్ హీరో. ఆ తర్వాత బాహుబలి చిత్రంలోకూడా నటించారు. తెలుగు, హిందీ భాషల్లో సుదీప్ కి మంచి పేరు ఉంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వల్ల ఎంతో మంది ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పలు ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోలు పేద ప్రజలకు సహాయం అందిస్తున్నారు. ఇక సినీ కార్మికుల కోసం విరాళాలు ఇస్తున్నారు. తాజాగా కిచ్చ సుదీప్ తన మంచి మనసు చాటుకున్నారు. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాల్లో తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 4 ప్రభుత్వం పాఠశాలలను సుదీప్ దత్తత తీసుకున్నాడు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేలా స్కాలర్ షిప్ ప్రోగ్రామ్స్ నిర్వహించడంతోపాటు వారికి డిజిటల్ క్లాస్ రూంలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వాలంటీర్స్ టీంతో కలిసి ప్లాన్ చేశాడు.
అక్కడ స్కూల్స్ పరిస్థితిని స్టడీ చేయడానికి వాలింటీర్లను పంపించి వారు ఇచ్చే రిపోర్ట్ ప్రకారం సహాయం చేసేందుక రెడీ అవుతున్నట్టు సమాచారం. ఇది మాత్రం ఆయన గోప్యంగా చేస్తున్నట్లు శాండిల్ వుడ్ టాక్. సైరా చిత్రం తర్వాత సుదీప్ ఫాంటోమ్, కిట్టీ-కోటిగొబ్బ 3, బిల్లా రంగా భాషా, థగ్స్ ఆఫ్ మాల్గుడి చిత్రాలతో బిజీగా ఉన్నాడు.