సినిమాల్లోకి ప్రవేశించిన తరువాత కొందరు హీరోయిన్లు తమ కెరీర్ ని మెల్లగా బిల్డప్ చేసుకుంటూ, ఒక స్థాయికి చేరాక మంచి ప్రాధాన్యం ఉన్న తల్లి, వదిన వంటి పాత్రలు చేస్తూ ముందుకు సాగుతుంటారు. ఇక మరికొందరైతే తమ కెరీర్ ముగుస్తుంది అనుకున్న సమయంలో పూర్తిగా సినిమాల నుండి నిష్క్రమించి, పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించిన వారున్నారు. అయితే వీరందరికంటే కొంత భిన్నంగా నడుస్తున్న నటి ఛార్మి. అప్పుడెప్పుడో 2002లో నీతోడు కావాలి సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పంజాబీ భామ ఛార్మి, ఆ తరువాత అక్కడక్కడా కొన్ని చిన్న, పెద్ద సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ వచ్చింది. అంతేకాక కొన్ని సినిమాల్లో రెండవ హీరోయిన్ పాత్రలు కూడా ఆమె చేసింది. అయితే అవేవి ఆమెకు కెరీర్ పరంగా పెద్దగా పేరు తీసుకురాలేదని చెప్పాలి. ఇకపోతే ఆ తరువాత కొన్నేళ్ళకు 2007లో మంత్ర అనే లేడి ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది ఛార్మి. అయితే ఆ తరువాత అదే తరహా పాత్రల్లో ఆమె నటించిన మంగళ, మంత్ర2 సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. 


ఇక దాదాపుగా 2015 తరువాత పూర్తిగా నటనకు గుడ్ బై చెప్పిన ఛార్మి, అంతకు ముందు 2014లో దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జ్యోతి లక్ష్మి అనే సినిమాను నిర్మించడమే కాక ఆ సినిమాలో ఆమె ప్రధాన పాత్రలో నటించింది కూడా. అయితే ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక అప్పటినుండి ఛార్మి, పూరి జగన్నాథ్ తో కలిసి వరుసగా కో ప్రొడ్యూసర్ గా సినిమాలు నిర్మిస్తూ వస్తోంది. అయితే రెండు రోజుల క్రితం హీరో రామ్ కథానాయకుడిగా పూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఇష్మార్ట్ శంకర్ సినిమా టీజర్ విడుదల అయి మంచి సక్సెస్ అవడంతో, పూరి కనెక్ట్స నిర్మాణ సంస్థలో భాగస్వామి అయిన చార్మీ, నేడు మీడియా మిత్రులతో తన అనుభవాలు పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ, దాదాపుగా 13 ఏళ్లుగా తాను అన్ని భాషల్లో కలిపి 55 సినిమాల్లో నటించానని అన్నారు. అయితే ఆ సమయంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని, ఇక ఇన్నేళ్లకు నిర్మాతగా మారాక తనకు పూర్తి స్థాయి సంతృప్తి కలుగుతోందని ఆమె అన్నారు. 


అంతేకాక ఇప్పటికీ తన వద్దకు కొన్ని సినిమాల్లో నటించమని అవకాశాలు వస్తున్నప్పటికీ కూడా తాను వాటిని సున్నితంగా తిరస్కరిస్తున్నానని, ఇకపై తన జీవితం మొత్తం ఇలా నిర్మాతగానే కొనసాగుతానని అన్నారు ఛార్మి. ఇక పూరి జగన్నాథ్ వంటి గొప్ప దర్శకుడి పర్యవేక్షణలో ఒక భాగస్వామిగా చిత్రాలు నిర్మిస్తూ ఉండడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇక రాబోయే మరికొద్ది రోజుల్లో పూరి తనయుడు ఆకాష్ తో ఒక చిత్రం, అలానే ఒక కొత్త దర్శకుడితో మరొక చిత్రం నిర్మించనున్నామని ఆమె అన్నారు. సో ఒకరకంగా ఇది ఛార్మి అభిమానులకు కాస్త ఇబ్బంది కలిగిచే వార్త అయినప్పటికీ, ఆమె పూర్తిగా సినిమాల నుండి వైదొలగకుండా నిర్మాతగా కొనసాగడం ఒకరకంగా ఆమె అభిమానులకు కాస్త ఊరటనిచ్చే విషయం అనే చెప్పాలి.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: