చిత్రం సినిమాతో ఎంట్రీ ఇచ్చి నువ్వునేను సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి.. ఎంతో మంది కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చిన దర్శకుడు తేజ టాలీవుడ్ లో ఓ విలక్షణ వ్యక్తిత్వం గల దర్శకుడు. ఆయన ముక్కుసూటితనానికి చాలా అవకాశాలు కోల్పోయినా సరే కష్టాన్ని నమ్ముకుంటూ టాలీవుడ్ లో నిలదొక్కుకుంటున్నాడు.


అయితే టాలీవుడ్ లో తాను ఇంత ఎత్తుకు ఎదిగినా తన బాల్యం మాత్రం ఎంతో చేదు జ్ఞాపకాలతో నిండిపోయిందని తేజ ఎమోషనల్ అయ్యారు. ఓ ఇంటర్వ్యూలో తన దుర్భర జీవితం గురించి వివరించారు. తన జీవితం కష్టాలు కన్నీళ్ల మయమని.. వింటే కన్నీళ్లు కార్చడం ఖాయమని చెప్పుకొచ్చారు.


తను పేద కుటుంబంలో పుట్టలేదని.. తమది ఎక్స్ పోర్ట్ వ్యాపారమని.. మా నాన్న గొప్ప వ్యాపారం చేసేవాడని తేజ చెప్పుకొచ్చారు. తాను- అక్క- చెల్లి ముగ్గురు సంతానమని.. రాజభోగాలు  చిన్నప్పుడు అనుభవించామని తేజ వివరించారు. కానీ మా అమ్మ మరణంతో తమ పరిస్థితి తలకిందులైందని వివరించారు. అమ్మ మరణంతో నాన్న కృంగిపోయి వ్యాపారాన్ని పెడచెవిన పెట్టాడని.. నష్టాలు వచ్చి ఆస్తులన్నీ పోయి నాన్న మానస్తాపంతో చనిపోయాడని తేజ వివరించారు..


ముగ్గురు పిల్లలమైన తాము అనాథలం అయ్యామని.. మా అక్క పెళ్లి చేసుకొని పోగా.. చెల్లిని బంధువులు స్వచ్ఛంద సంస్థలో చేర్చారని.. నన్ను మా బాబాయి తీసుకెళ్లాడని వివరించారు. తాను అక్కడ ఉండలేక విజయవాడ వెళ్లి అష్టకష్టాలు పడ్డానని తేజ వివరించాడు. బతుకు దెరువు కోసం లారీ క్లీనర్ గా చేరానని.. హోటల్ లో పనిచేశాడనని వివరించారు. చివరకు చెన్నై వెళ్లి కెమెరా అసిస్టెంట్ గా చేరి వాళ్లు పెట్టే ఒకపూట భోజనంతో కడుపు నింపుకొని ఫ్లాట్ మీద పండేవాడినని వివరించారు. ఒక ప్యాంట్ రెండు చొక్కాలు ఉండేవని అవే ఉతుక్కొని కుళాయి దగ్గర వేసుకునేవాడినని తెలిపారు.
ఇళ్లు ఆశ్రయం లేని నేను షూటింగ్ లోనే ప్రొడక్షన్ వాళ్లు పెట్టేది తిని బతికానని వివరించాడు. సినిమా మధ్యలో రోజువారీ ఖర్చులకు కార్లు కడిగి నెలంతా వంద రూపాయలు సంపాదించి కడుపునింపుకునేవాడినని తెలిపారు.


ఇప్పటికీ చెన్నై వెళ్లినప్పుడు తాను ఫ్లాట్ మీడ రోడ్డు పక్కన నిద్రపోయిన ప్రదేశాలకు వెళ్లి నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నానని తేజ వివరించాడు. తన కష్టాల స్టోరీని వింటే కన్నీల్లు వస్తాయని తేజ ఎమోషనల్ అయ్యారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: