నిన్న ‘సాహో’ టీజర్ తో పోటీగా విడుదలైన ‘మన్మధుడు 2’ టీజర్ కు స్పందన విషయంలో చాల గ్యాప్ ఉంది. ‘సాహో’ టీజర్ ట్రెండింగ్ లిస్టులోకి చేరిపోతే ‘మన్మధుడు 2’ టీజర్ నెమ్మదిగా కనెక్ట్ అవుతోంది. వాస్తవానికి నాగార్జున మూవీ టీజర్ ప్రభాస్ టీజర్ తో పోటీ పడకుండా ఉంటే ‘మన్మధుడు 2’ టీజర్ కు ఇంకా మరింత మెరుగైన హిట్స్ వచ్చి ఉండేవి అన్న అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాలలో వ్యక్తం అవుతోంది.

గతంలో దిల్ చేసిన పొరపాటు నాగార్జున చేస్తున్నాడా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఇలాంటి కామెంట్స్ రావడం వెనుక ఒక ఆసక్తికర కారణం ఉంది. దిల్ రాజ్ ఎన్నో భారీ అంచనాలతో నిర్మించిన ‘శ్రీనివాస కళ్యాణం’ విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ విడుదలకు ముందు సరిగ్గా ఒక వారం రోజులు ముందు విడుదలై ‘గీత గోవిందం’ మ్యానియాలో కొట్టుకు పోయింది.

వాస్తవానికి ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ వచ్చిన ‘శ్రీనివాస కళ్యాణం’ గురించి ఫ్యామిలీ ఆడియన్స్ కూడ పట్టించుకోలేదు. ఇప్పుడు అదే తీరులో నాగార్జున తన ‘మన్మధుడు 2’ సరిగ్గా ‘సాహో’ విడుదలకు కేవలం వారం రోజులు ముందు విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తూ ఆగష్టు 8వ తేదీని బ్లాక్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

దీనితో నాగ్ ఈ అనవసరపు పోటీకి ఎందుకు లైన్ క్లియర్ చేశాడు అంటూ చాలామంది షాక్ అవుతున్నారు. వాస్తవానికి ‘మన్మధుడు 2’ మూవీ కూడ ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమాగా సంకేతాలు వస్తున్నాయి. అయితే ప్రభాస్ మ్యానియాతో ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టి కూడ ‘సాహో’ పైనే వెళ్ళిపోయే ఆస్కారం ఉంది. ఇప్పటికే వరస పరాజయాలతో సతమతమవుతున్న నాగార్జునను ఇలాంటి సాహసం చేయవద్దని నాగ్ సన్నిహితులు సలహాలు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: