బాలీవుడ్ నిర్మాత, అతిలోక సుందరి శ్రీదేవి భర్త బోనీ కపూర్ ప్రస్తుతం తమిళ సినిమా ‘నేర్కొండ పార్వాయి’ ప్రచారంలో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పింక్’కు ఇది రీమేక్. ఈ చిత్రం ద్వారా తమిళ సినీ పరిశ్రమకు తాను రుణం తీర్చుకుంటానని బోనీ కపూర్ చెబుతున్నారు. అయితే, తాను ఈ తమిళ చిత్రం చేయడం వెనుక తన దివంగత భార్య శ్రీదేవి ఉందని బోనీ కపూర్ వెల్లడించారు. ‘పింక్’ సినిమాను తమిళంలో రీమేక్ చేస్తే అమితాబ్ పాత్రను అజిత్ చేస్తేనే బాగుంటుందని శ్రీదేవి చెప్పినట్లు బోనీ కపూర్ గుర్తుచేసుకున్నారు. 


తాజాగా ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడుతూ.. ‘నేనూ ఎప్పటికీ సినీ ప్రేమికుడినే. అది తమిళ సినిమానా, మలయాళ సినిమానా, కన్నడ సినిమానా, తెలుగు సినిమానా, హిందీ సినిమానా లేదంటే వరల్డ్ సినిమానా అనే తేడా లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఏ సినిమానైనా నేను చూస్తా. ఇలా చూడటమంటే నాకెంతో ఇష్టం. అదృష్టవశాత్తు కొన్ని తమిళం, తెలుగు సినిమాలను నేను హిందీలో రీమేక్ చేశాను. వాటిలో చాలా సినిమాలు విజయవంతమయ్యాయి. కాబట్టి దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీకి నేనెంతో రుణపడి ఉన్నాను. ముఖ్యంగా తమిళ పరిశ్రమకి’ అని వెల్లడించారు.


అయితే ఈ సందర్భంగా శ్రీదేవికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను బోనీ కపూర్ చెప్పారు. ‘నేర్కొండ పార్వాయి’ సినిమాను అజిత్‌తో చేయడమనేది శ్రీదేవి కోరికని బోనీ కపూర్ తెలిపారు. ‘అజిత్ చాలా ఉదారస్వభావం కలిగిన వ్యక్తి. చాలా సపోర్టివ్‌గా ఉంటారు. గతంలో నేను, శ్రీదేవి చెన్నై వచ్చినప్పుడు అజిత్‌ను కలిశాం. అజిత్ ‘పింక్’ గురించి మాట్లాడారు. శ్రీదేవి కూడా అజిత్‌తో ఏకీభవించింది. మేమంతా కలిసి ‘పింక్’ సినిమా చూశాం. ఈ సినిమాను తమిళ్‌లో చేస్తే కచ్చితంగా అజిత్ అయితేనే సరిపోతారని శ్రీదేవి అభిప్రాయపడింది. అజిత్‌కు మహిళలపై ఎంతో గౌరవం ఉంది. అంతేకాదు, ఆ పాత్రకు కావాల్సిన లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి. అందుకే ఆయనతో ఈ సినిమా చేయాలని భావించాను’ అని బోనీ కపూర్ చెప్పుకొచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: