ఓ! బేబి సినిమా తర్వాత ఎలాంటి కథను ఎంచుకోవాలి? అనే తికమకలో ఉన్నానని అగ్ర కథానాయిక సమంత అన్నారు. నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత టైటిల్ రోల్లో నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి, హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కొరియన్ మూవీ అయిన "మిస్ గ్రానీ" కి రీమేక్. ఈ నేపథ్యంలో ఆదివారం సినిమా ‘థ్యాంక్స్ మీట్’ను ఏర్పాటు చేశారు. చిత్ర బృందంతోపాటు హీరో రానా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. ‘నేను ‘ఓ బేబీ’ సినిమా షూటింగ్లో పాల్గొనన్ని రోజుల కంటే.. చిత్రం ప్రమోషన్లో పాల్గొన్న రోజులే ఎక్కువ. నా లుక్, దుస్తులు మాత్రమే మారుతూ వచ్చాయి. కానీ మాటలు మాత్రం అవే. యూట్యూబ్, టీవీ.. ఎక్కడ చూసినా నీ ముఖమే కనిపిస్తోందని చాలా మంది అన్నారు. నాకు కూడా అలానే అనిపించింది. కానీ ప్రచారం చేయకపోతే ప్రజలు రారు.. తప్పదు కదా. సినిమా విడుదల ముందు రోజు రాత్రి మొత్తం నేను నిద్రపోలేదు.
తొలిరోజు నుంచే సినిమాకు పాజిటీవ్ రిప్లైలు వచ్చాయి. ఆ రోజు భావోద్వేగానికి గురయ్యా. మీ అందరికీ ధన్యవాదాలు. ఇది నాకు ఓ గొప్ప బహుమతి’.ఈ సినిమా తర్వాత ఇంకేం చేయాలని నేను నందిని రెడ్డితో అన్నా. ఇక రిటైర్మెంట్ తీసుకోవాలా? (సంతృప్తి చెందిన భావనతో). ‘ఓ బేబీ’ తర్వాత ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే తికమకలోనే ఉన్నాను. నాకు తెలుసు.. ఇలా కేవలం మరో రెండు రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత ఇంకా ఉత్తమమైన స్క్రిప్టు, నటన అని ఆలోచిస్తా.
ఏదేమైనా ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నా. నా మొత్తం చిత్ర బృందానికి ధన్యవాదాలు. ఫాలోవర్స్ చేసే ప్రతి ట్వీట్ చదువుతున్నా. కానీ అందరికీ రిప్లై ఇవ్వలేను. ప్రతి ట్వీట్ నా హృదయాన్ని తాకుతోంది’ అని చెప్పారు.ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రానా... ‘ఓ బేబి’ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. తనకు కూడా కొరియన్ సినిమా కథలు వినిపించాలని ‘ఓ బేబి’ చిత్ర బృందానికి విజ్ఞప్తి చేసి చమత్కరించారు.