‘మల్లేశం’ హీరో, కమెడియన్ ప్రియదర్శి బైక్ చోరీకి గురైందంటూ వచ్చిన వార్త సోమవారం రాత్రి నుంచి బాగా వైరల్ అయ్యింది. తన ఇంటి ముందు ఉంచిన బైక్ చోరీకి గురైనట్టు ప్రియదర్శి వెల్లడించారు. ఈ మేరకు వీడియోను స్వయంగా ప్రియదర్శి ట్వీట్ చేశారు. ఇది సీసీటీవీ ఫుటేజ్ అంటూ పేర్కొన్నారు. 
‘నా బైక్ చోరీకి గురైనప్పటి వీడియో ఫుటేజ్ ఇది! అక్కడ సీసీటీవీ ఉందని ఈ మనిషి కనీసం చూసుకోలేదు. వీడో నైపుణ్యంలేని దొంగ’ అని ప్రియదర్శి ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు నిజంగానే ప్రియదర్శి బైక్ చోరీకి గురైందని అనుకున్నారు. తెగ రీట్వీట్‌లు చేశారు. కొన్ని వెబ్‌సైట్లలో అయితే ప్రియదర్శి పోలీసులను ఆశ్రయించారని కూడా రాసేశారు. 


వాస్తవానికి ఇదొక ‘దొంగ’ నాటకం. సందీప్ కిషన్ హీరోగా, నిర్మాతగా వస్తోన్న ‘నిను వీడని నీడను నేనే’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ డ్రామా ఆడారు. ఇది విపరీతంగా వైరల్ కావడం, పరిస్థితి గాడి తప్పడంతో విషయాన్ని బయటపెట్టేశారు. ప్రియదర్శి తన ట్వీట్‌ను డిలీట్ చేసేశారు. ఆ తరవాత రంగంలోకి దిగిన సందీప్ కిషన్ ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు.


‘క్షమించండి, ఈ విషయంలో మేం అనుకున్నదానికంటే తీవ్రత ఎక్కువైంది. మేం నిర్మిస్తోన్న ‘నిను వీడని నీడను నేనే’ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా సరదాగా చేసినది. ఈ సినిమాలో ప్రియదర్శి నటించడానికి వీలుపడలేదు. అందుకే, ఆయన బైక్‌‌ను మా సినిమాలో ప్రత్యేకంగా పెట్టాం. ఈ బైక్ నడుపుతుంటే భలే ఉంది. లవ్ యూ దర్శి బోయ్’ అని సందీప్ కిషన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో అసలు విషయం బయటపడింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: