ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వసూళ్లు చేస్తుంది ‘ఇస్మార్ట్ శంకర్’. ఎన్టీఆర్ తో ‘టెంపర్ ’ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ ఒక్క హిట్ కూడా కొట్టలేక పోయాడు. దాంతో ఈసారి ఎలాగైనా సెన్సేషన్ క్రియేట్ చేయాలన్న తపనతో తెరకెక్కించారు ‘ఇస్మార్ట్ శంకర్’. హీరో రామ్ కి ఉన్న ఎనర్జీనీ వెండి తెరపై బీభత్సంగా చూపించి మాస్ మార్కులు కొట్టేశారు పూరి జగన్నాథ్. ఇస్మార్ట్ శంకర్ లో రామ్ హీరో నభ నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు.
నటి ఛార్మీ ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. పక్కా మాస్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో పూరి ఈజ్ బ్యాక్ అంటూ టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో పూరి జగన్నాథ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం రాసిన 'జనగణమన' విషయంలో ఎన్నో తర్జనభర్జనలు అవుతూ వచ్చాయి. అయితే టాలీవుడ్ లో మహేష్ బాబు కోసం రాసిన 'జనగణమన' సినిమా కథని కన్నడ హీరో 'యాష్'కు చెప్పాడనే వార్తలు హాల్-చల్ చేస్తున్నాయి.
అప్పట్లో ఆ సినిమాకి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈ విషయంపై పూరి బహిరంగంగానే తన అసంతృప్తిని తెలియచేశాడు. తాజాగా ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టిన జోష్ లో ఉన్న పూరి తిరిగి ఆ కథని బయటికి తీశాడు. 'కెజిఎఫ్' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన 'యాష్'కు ఈ సినిమా కథని పూరి చెప్పడం జరిగిపోయిందని కన్నడ సినీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే యష్ కి ఉన్న ఇమేజ్ ప్రకారం ఈ మూవీలో కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం 'యాష్' సూపర్ హిట్ మూవీ 'కెజిఎఫ్' సీక్వెల్ చాప్టర్-2లో నటిస్తున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే పూరి మూవీలో యష్ నటించబోతున్నాడని టాలీవుడ్ లో బలమైన టాక్ వినిపిస్తుంది.