తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు అంటే.. మాయాబజార్ మిస్సమ్మ కాలంలో.. అద్భుతమైన సినిమాలు వచ్చాయి. కానీ ఆ తరువాత కాలానుగుణంగా సినిమా మేకర్స్ కూడా మారుతూ తెలుగు సినిమా అంటే... రొటీన్ లవ్ స్టోరీలు, లాజిక్ లేని హీరో ఎలివేట్ సీన్స్ లు, అర్ధం పర్ధం లేని పంచ్ డైలాగ్ లు అని ఫిక్స్ అయ్యేలా చేసారు మన డైరెక్టర్స్. అందుకు తగ్గట్లుగానే గడిచిన రెండు దశాబ్దాలలో అరకొర కొన్ని సినిమాలు మినహాయించి.. అన్ని కమర్షియల్ సినిమాలే టాలీవుడ్ ను ఎలాయి. ఓ టైంలో అయితే సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంటే చాలు.. ఇక సినిమా హిట్టు బాట పట్టేసినట్లే అని నమ్మేవాళ్లు అంటే నమ్ముతారా... అయితే ఇదే ఫార్మాట్ ను మన తెలుగు ప్రేక్షకులు మీద డైరెక్టర్స్ రుద్దే ప్రయత్నం చేసినా వాటిని తిప్పి కొట్టిన సందర్భాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయనుకోండి.
ఇక గడిచిన నాలుగైదు ఏళ్లల్లో మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ దిశ మార్చుకుని మరో మెట్టు పైకి ఎక్కిందనే చెప్పాలి. కమర్షియల్ సినిమాలను తీస్తే చూసే రోజులు పోయి.. ఏమాత్రం కంటెంట్ ఉన్నాసరే ఆ సినిమాలకు మన తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. గత ఏడాది వరకు ఆ మధ్య వచ్చిన “కేరాఫ్ కాంచరపాలెం”, “మజిలీ”, “జెర్సీ”, ఇటీవలే వచ్చిన “బ్రోచేవారేవారురా”, “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ”, “ఓ బేబీ” వంటి వినూత్న సినిమాలు ఎన్నో విభిన్న కథాంశాలతో తెరకెక్కి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నావే. ఇలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావు అని ఓ నమ్మకం ఉంది మనోళ్ళకి. కానీ పైన చెప్పుకున్న సినిమాలు కమర్షియల్ గా మంచి హిట్ అయ్యాయి.
మొత్తానికి తెలుగు పరిశ్రమకు కాలం కలిసివచ్చినట్లు అనిపిస్తోంది. బాహుబలి, సైరా, ఘాజీ, సాహో లాంటి సినిమాలతో టాలీవుడ్ ను నేషనల్ రేంజ్ లో అంతకంతకు అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి చేర్చుతూ విమర్శకుల సైతం ప్రశంసలు అందించేలా టాలీవుడ్ ను తయారుచేస్తున్నందుకు కొత్తతరం దర్శకులను అభినందించాలి.