బాలీవుడ్ లో బయోపిక్స్ ని రూపొందించడం కొత్తేమి కాదు. అయితే ఇప్పటివరకు రాజకీయనాయకుల, సినీ తారల, క్రీడా కారుల బయోపిక్స్ తో పాటు ఫేమస్ సైంటిస్టుల బయోపిక్స్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ బయోపిక్స్ కి ప్రేక్షకుల నుండి ఆదరణ కూడా బాగా లభిస్తుండటం చూస్తున్నాము. ఇప్పుడు ఇదే నేపథ్యంలో ఇండియన్ ఐటీ ఫస్ట్ కపుల్‌గా ఎంతో పాపులర్ అయిన నారాయణ మూర్తి, సుధా మూర్తి దంపతుల జీవితాధారంగా బాలీవుడ్‌లో బయోపిక్ తెరకెక్కనుంది. ప్రముఖ దర్శకురాలు అశ్విని అయ్యర్ తివారీ ఈ బయోపిక్‌ను తెరకెక్కించబోతున్నట్లు రీసెంట్‌గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాకు 'మూర్తి' అనే టైటిల్‌ను కూడా ఫైనల్ చేశారు చిత్ర బృందం. ఇక సుధా మూర్తి పాత్రలో ఎవరు నటించనున్నారు అన్న ప్రశ్నపై బాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోందని సమాచారం. 

ఆమె పాత్రలో నటించేందుకు బాలీవుడ్ నటి ఆలియా భట్‌ను ఎంపిక చేసుకున్నట్లు లేటెస్ట్ న్యూస్. మూర్తి దంపతులపై బయోపిక్ అనగానే సుధా మూర్తి పాత్రలో నటించడానికి ఆలియా వెంటనే ఒప్పుకున్నటు తెలుస్తోంది. ఎలాంటి పాత్రల్లోనైనా నేను నటించగలనని ఇప్పటికే ప్రూవ్ చేసుకున్న ఆలియా.. సుధా మూర్తి పాత్రకు తను 100 పర్సెంట్ న్యాయం చేస్తుందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఆలియా నుంచి క్లారిటి రావాల్సి ఉంది. ఇప్పటికే ఆలియా ముంబయికి చెందిన మాఫియా క్వీన్ గంగూబాయ్ కఠియావాడి ప్రాతలో నటించనున్నారు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్మాతగా వ్యవహరిస్తుండగా ఇది కూడా బయోపిక్ అన్న విషయం తెలిసిందే. 

ఇవే కాకుండా ఆలియా చేతిలో 4-5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ ఆర్ ఆర్', హిందీలో 'బ్రహ్మాస్త్ర', 'సడక్ 2' సినిమాలలో నటిస్తుంది. చేతినిండా సినిమాలు ఉన్నప్పటికీ సుధా మూర్తి వంటి స్ఫూర్తిదాయకమైన మహిళ పాత్రలో నటించే అవకాశం తనకు మళ్లీ రాదన్న ఉద్దేశ్యంతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
మరి నారాయణమూర్తి పాత్రలో ఎవరు నటించనున్నారు అన్న విషయం మాత్రం ఇంకా సస్పెన్స్ గా ఉంది. ప్రస్తుతం అశ్విని 'పంగా' సినిమాతో బిజీగా ఉన్నారు. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో కంగనా కబడ్డీ ప్లేయర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా పూర్తయిన తరవాత 'మూర్తి' సినిమాని అశ్విని మొదలుపెట్టనున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: