హీరోగా రాణించిన జగపతిబాబు కు సినిమా రంగంలో మంచి బ్యాంక్ గ్రౌండ్ ఉంది. వారసత్వ ఆసరాతో సినిమాల్లోకి ప్రవేశించినా తరువాత జగపతిబాబు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎంతో శ్రమించి హీరోగా రాణించాడు. ఇటు ఫ్యామిలీ కథా చిత్రాలతోనూ, అటు గాయం, అంత:పురం వంటి యాక్షన్ చిత్రాలతోనూ మెప్పించాడు. తనకంటూ ఒక అభిమాన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. హీరోగా రాణిస్తున్న సమయంలోనే ఇతర హీరోల సినిమాల్లో ప్రత్యేక పాత్రలు పోషించాడు. కేవలం ప్రత్యేక పాత్రలకే కోటి రూపాయిలకు పైగా పారితోషం తీసుకున్నాడు. అయితే ఇటీవల కాలం జగపతి బాబు కు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. 

అవకాశాలు తగ్గుముఖం పట్టిన జగపతిబాబు ఇప్పుడు ఏ అవకాశాన్ని వదులు కోవడం లేదు. పాత్ర ఎలాంటిదైనా పైసలు ఇస్తే చాలు సై అంటున్నాడు. నటుడుగా మంచి గుర్తింపు, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న జగపతి బాబు ఇలా చేయ్యడం ఫిల్మ్ నగర్ వర్గాలను విస్మయపరుస్తోంది. ఇటీవల విక్రమ్ సినిమాలో విలన్ గా నటించిన జగపతిబాబు మరొక కొత్త సినిమాలో కామెడీ పాత్ర చేయబోతున్నాడు. కామెడీ పాత్ర అయితే ఏమిటీ అనుకుంటున్నారా.. ఆ పాత్ర గురించి పూర్తి గా తెలుసుకుంటే ఆశ్చర్యపోవడం మనవంతు అవుతుంది.

ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లాం ఊరెళితే..’ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. శ్రీకాంత్- వేణు నటించిన ఈ సినిమాలో కామెడీకి ప్రేక్షకుల బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాకు ఎస్వీ కృష్ణారెడ్డి త్వరలోనే సీక్వెల్ తీయబోతున్నాడు. శ్రీకాంత్- వేణు తమ పాత్రల్లో నటించనున్నారు. అయితే  ‘పెళ్లాం ఊరెళితే..’ సినిమాలో సునీల్ కూడా ఒక చిన్న పాత్ర పోషించాడు. ఇప్పుడు ఈ కొత్త సినిమాలో నటించడానికి సునీల్ అంగీకరించడం లేదు. హీరోగా మంచి అవకాశాలు వస్తున్న సమయంలో మళ్ళీ కామెడీ వేషాలు వేయడానికి సునీల్ మొగ్గు చూపడం లేదు. దీంతో సునీల్ వేసిన కామెడీ పాత్ర చేయమని అడిగిన వెంటనే జగపతిబాబు సరే అన్నాడు. 

జగపతిబాబు ఈ కామెడీ పాత్ర చెయ్యడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎంతగా అవకాశాలు లేకపోయినా జగపతి బాబు లాంటి ఒక నటుడు సునీల్ వద్దన్న కామెడీ పాత్ర చేయడం  కొంత మందికి విశేషంగా అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: