‘పైసా వసూల్’ షాక్ ను లెక్క చేయకుండా బాలకృష్ణ తన లేటెస్ట్ మూవీ షూటింగ్ లో చాల ఉత్సాహంగా పాల్గొంటున్నాడు. ప్రముఖ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీలో బాలకృష్ణకు లక్కీ హీరోయిన్ గా మారిన నయనతార ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. 

ఈసినిమాకు సంబంధించిన ఒక లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు లీక్ అయింది. ఈసినిమాలో బాలకృష్ణ 40 సంవత్సరాలు నిండిన బ్రహ్మచారిగా కనిపిస్తాడట. బాలయ్య ఇలా బ్రహ్మచారిగా మారడానికి నయనతార కారణం అని తెలుస్తోంది. తానెంతగానో ప్రేమించిన నయనతార మరో వ్యక్తిని పెళ్ళి చేసుకుని వెళ్ళి పోవడంతో నయనతార జ్ఞాపకాలలో కాలం గడుపుతూ బ్రహ్మచారి జీవితాన్ని గడుపుతూ ఉంటాడట బాలయ్య.

అయితే అనూహ్యంగా మ‌రొక‌రిని పెళ్లి చేసుకున్న నయనతార మళ్ళీ అనుకోకుండా బాలకృష్ణ  జీవితంలో ప్ర‌వేశిస్తే ఏమి జరుగుతుంది అన్న ట్విస్ట్ లతో ఈమూవీ కథ నడుస్తుందని సమాచారం. చాలాకాలం తరువాత బాలకృష్ణలోని కామెడీ యాంగిల్ ను ఈసినిమాలో నందమూరి అభిమానులు చూడబోతున్నారని టాక్. 

ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ కుంభ‌కోణంలో జరుగుతున్న నేపధ్యంలో దాదాపు 28 రోజుల పాటు ఈసినిమాకు సంబంధించిన కీల‌క స‌న్నివేశాలు అక్కడ చిత్రీకరిస్తారని తెలుస్తోంది. అడుగడుగునా దేవాలయాలతో ఉండే కుంభకోణం లోని ప్రాంతాలు ఈసినిమా సన్నివేశాల షూటింగ్ కు అనువుగా ఉంటుందని అక్కడ షూట్ చేస్తున్నట్లు టాక్. 

‘పైసా వసూలు’ ఇచ్చిన షాక్ తో నిరాశ పడ్డ బాలకృష్ణ ఈసినిమా షూటింగ్ ను అతి వేగంగా పూర్తి చేసి తనకు సెంటి మెంట్ గా బాగా కలిసి వచ్చే రాబోతున్న సంక్రాంతికి విడుదల చేసి ‘శాతకర్ణి’ స్థాయిలో మళ్ళీ విజయం అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే ఈసారి ఏకంగా బాలకృష్ణ పవన్ త్రివిక్రమ్ ల మూవీతో పోటీ పడుతూ ఉండటం అత్యంత షాకింగ్ గా మారింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: