తెలుగు బుల్లితెరపై మొట్టమొదటి సారిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్. ఈ షో మొదట్లో పెద్దగా ఆకర్షించకపోయినా..ఒక్కొక్కరూ ఎలిమినేట్ అవుతున్న తీరు..కొన్ని ట్విస్టులు, కంటెస్టంట్ల మద్య గొడవలు, బుజ్జగింపులు ఇలాంటి వాటితో షో కాస్త రసవత్తరంగా సాగుతుంది.
బిగ్ బాస్ హౌజ్ నుంచి ఇప్పటి వరకు జ్యోతి, మధు ప్రియ,సమీర్, కత్తి మహేష్, కల్పన,ధన్ రాజ్, కత్తి కార్తీక, ముమైత్ ఖాన్, ప్రిన్స్, ఎలిమినేట్ అయ్యారు. ఇక సంపూర్ణేష్ బాబు మాత్రం తన మానసిక పరిస్థితి బాగాలేదని..అక్కడ ఉండలేక పోతున్నానని మద్యలోనే వెళ్లిపోయాడు. ఆయన స్థానంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో అందాల భామ దీక్షా పంత్, హీరో నవదీప్ లు ఎంట్రీ ఇచ్చారు.
ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో శివబాలాజి, నవదీప్, ఆదర్శ్, హరిప్రియ,దీక్షాపంత్, అర్చన మిగిలారు. ఈ వారం వీరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు. అయితే గత కొన్ని రోజుల నుంచి బిగ్ బాస్ హౌజ్ లో తారల సందడి నెలకొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రానా, తాప్సీ, అల్లరి నరేష్, సచిన్ లతో పాటు ఉంగరాల రాంబాబు చిత్రం ప్రమోషన్ కోసం కామెడీ హీరో సునీల్ కూడా హల్ చల్ చేశారు. శని, ఆదివారాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న హంగామా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు..వారం రోజుల్లో ఐదు రోజులు బిగ్ బాస్ డల్ గా ఉన్నా ఆ రెండు రోజులు మాత్రం టివిలకు ప్రేక్షకులు అతుక్కు పోతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షో ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో, ఇద్దరు టాలీవుడ్ భామలు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరా అనుకుంటున్నారా..! జై లవ కుశ' సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించిన నివేదా థామస్, రాశీఖన్నా. ఈ రోజు శనివారం కావడంతో, జూనియర్ కూడా షోలో కనిపించనున్నాడు.
మొత్తానికి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో తనకు ‘జై లవ కుశ’ చిత్రం ప్రమోషన్ కి భలే ఉపయోగ పడుతుందని అంటున్నారు. , ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన 'జై లవ కుశ' ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఈ సినిమా ప్రచారంలో భాగంగా నివేదా, రాశీ ఖన్నాలు బిగ్ బాస్ లో సందడి చేయడం ప్రేక్షకులు ఫుల్ హ్యాపీలో ఉన్నారు.