ప్రముఖ సినీ నిర్మాత, కమ్యూనిస్టు నాయకుడు అట్లూరి పూర్ణచంద్రరావు (92) కన్నుమూశారు. మేడ్చల్ జిల్లా కాప్రా మండలం పరిధిలోని కమలానగర్లో ఆయన స్వగృహంలో ఆదివారం మరణించారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విజయవంతమైన సినిమాలను ఆయన నిర్మించారు. నవయుగ డిస్ట్రిబ్యూటర్స్ లో రిప్రజంటేటివ్ గా చేరారు. ఈ క్రమంలో గుంతకల్లు నవయుగ బ్రాంచ్ మేనేజర్ స్థాయికి ఎదిగారు. ఇక్కడ మేనేజర్ గా పనిచేస్తున్న సమయంలోనే దర్శకుడు తాతినేని ప్రకాశరావు వద్ద సహాయకుడిగా పని చేసేందుకు మద్రాసు వెళ్లారు.
1964లో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు. నవ భారత్ ఫిల్మ్స్ బ్యానర్పై మొదటిసారిగా అగ్గిమీద గుగ్గిలం చిత్రాన్ని నిర్మించారు.ఆ తరువాత వరుసగా తెలుగులో 35 సినిమాలు, హిందీలో 18 సినిమాలను తీశారు. దర్శకులు విఠలాచార్య, పి. పుల్లయ్య దగ్గర పనిచేశారు. ‘దేవదాసు’ నిర్మాత డిఎల్ నారాయణ, ఎస్. భావనారాయణల ప్రోత్సాహంతో ప్రొడక్షన్ రంగంలోకి దిగారు.
విజయవాడ నవభారత్ బుక్ హౌస్ ప్రకాశరావుని భాగస్వామిగా చేసుకుని ‘అగ్గిమీద గుగ్గిలం’ సినిమాకు ఆయన నిర్మాతగా అవతారమెత్తారు. ఆ తర్వాత ‘ఉక్కుపిడుగు’, ‘రౌడీరాణి’, ‘పాపం పసినవాడు’, ‘యమగోల’ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.
తమిళంలో 13 సినిమాలు, కన్నడ, బెంగాలీ, ఒరియా, మరాఠీ భాషలలో రెండేసి చిత్రాలను నిర్మించారు. భోజ్పురిలో ఒక చిత్రం తీశారు. ఔనన్నా, కాదన్నా ఆయన చివరి సినిమా. పూర్ణచంద్రరావు మృతిపై పలువురు సినీ ప్రముఖులు, కమ్యూనిస్టు నాయకులు సంతాపం తెలిపారు.