తెలుగు ఇండస్ట్రీలో మొదటి సారిగా అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎవడే సుబ్రమణ్యం చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మహానటి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తిసురేష్ నటిస్తోంది. అయితే సావిత్రి నటిగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇండస్ట్రీలో ఆమెతో నటించిన సహనటులు ఎన్టీఆర్,ఏఎన్ఆర్,ఎస్వీఆర్ లతో పాటు జమున తదితరులు ఆమె లైఫ్ తో జర్నీ చేశారు.
ఇక అప్పటి సినీ దిగ్గజాల పాత్రల కోసం ఈ జనరేషన్ లోని నటులను ఎంపిక చేస్తున్నారు. సావిత్రి భర్తగా జెమినీగణేషన్ పాత్రలో మాళీవుడ్ నటుడు దుల్కర్ సల్మాన్ ని తీసుకున్నారు. మిగతా పాత్రల కోసం మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ లాంటి వారిని ఫైనల్ చేయగా దర్శకుల పాత్రలకు క్రిష్, తరుణ్ భాస్కర్ లను తీసుకున్నారు.
ఈ సినిమాలో మరో ముఖ్యపాత్ర కోసం అర్జున్ రెడ్డి ఫేమ్ దేవరకొండ విజయ్ ని తీసుకుంటున్నట్లు తెలిసింది. తాజాగా సమాచారం ప్రకారం విజయ్, అలానాటి స్టార్ హీరో అక్కినేని నాగేశ్వర్రావు పాత్రలో నటించనున్నాడట. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ గా ఎవరు కనిపించినున్నారన్న విషయం తెలియాల్సి ఉంది. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.