ప్రేమమ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ వరుసగా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడికి ఉన్న క్రేజ్కు చేతిలో నాలుగు అయిదు సినిమాలైనా ఉండాలి. కాని ఈమె కాస్త అతి చేస్తూ వచ్చిన ఆఫర్స్ను కాదంటుంది. తాజాగా ఉన్నది ఒకటే జిందగిలో నటించింది. ఆ సినిమాలో మంచి పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఆ పాత్ర తరహాలో ఉంటేనే, పాత్రకు ప్రాముఖ్యత ఉండి, మంచి కథ అయితేనే సినిమాలు చేస్తాను అంటూ పట్టుబట్టుకుని కూర్చుంది.
ఉన్నది ఒకటే జిందగీ తర్వాత ఈ అమ్మడికి ఒక భారీ చిత్రంలో నటించే ఆఫర్ దక్కింది. స్టార్ హీరోతో స్టార్ డైరెక్టర్ చేయబోతున్న ఆ సినిమా త్వరలో ప్రారంభం కాబోతుంది. ఆ సినిమాలో నటించేందుకు మొదట ఓకే చెప్పిన ఈ అమ్మడు కథ విన్న తర్వాత డేట్స్ ఖాళీ లేవు అంటూ తప్పుకుంది. తెలుగులో ఈమె ప్రస్తుతం పెద్దగా చేస్తున్న సినిమాలు ఏమీ లేవు. అయినా కూడా డేట్లు ఖాళీ లేవు అన్నది అంటే ఖచ్చితంగా కథ నచ్చక పోవడం వల్లే సినిమా నుండి తప్పుకుందని సినీ వర్గాల వారు భావిస్తున్నారు.
అనుపమ నో చెప్పడంతో ప్రస్తుతం ఆ స్టార్ డైరెక్టర్ మరో హీరోయిన్తో చర్చలు జరుపుతున్నాడు. ఆమె ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్లో నటించే అవకాశం ఉంది. అనుపమ ఇలా ఆఫర్లను వదులుకోవడంను కొందరు తప్పుబడుతున్నారు. అన్ని సినిమాల్లో కూడా పాత్రకు ప్రాముఖ్యత ఉండాలి, కథ బాగుండాలి అంటే కుదరదని, ఇలా చేస్తే కెరీర్లో రాణించడం కష్టం అవుతుందని, కొన్నాళ్ల తర్వాత అసలు ఆఫర్లు ఉండవని హెచ్చరిస్తున్నారు.