ఒక్క సినిమా యావత్ భారత దేశం మొత్తం హాట్ టాపిక్ గా మారింది..ఇంకా రిలీజ్ కాని ఆ సినిమాకు ఎంత పబ్లిసిటి రావాలో అంత పబ్లిసిటి వచ్చింది. ఇంతకీ ఏం సినిమా అనుకుంటున్నారా..! ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘పద్మావతి’. ఈ మూవీ షూటింగ్ మొదలైనప్పటి నుండి అనేక వివాదలతో వార్తలలో నిలుస్తూనే ఉంది. కర్ణిసేన ఈ చిత్రాన్ని విడుదల కానివ్వమని పట్టుబట్టుకు కూర్చుంటే దర్శక నిర్మాతలు మాత్రం మూవీ రిలీజ్ కోసం చాలా ప్రయత్నాలు చేశారు.
ఇక ఈ మూవీ విడుదలైతే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్ - రాజస్థాన్ - మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డారు. డిసెంబర్ 1న విడుదల కావలసి ఉన్న ఈ చిత్రం పలు వివాదాల నడుమ వాయిదాలు పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ చిత్రం జనవరి 25న రిలీజ్ కానున్నది. అంతా బాగుందీ అనుకున్న సమయంలో ‘పద్మావత్’ రాజస్థాన్లో విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు.
ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లియరెన్స్ దక్కినా...సెన్సార్ బోర్డు సూచన మేరకు సినిమా పేరులో మార్పు, ఇతర మార్పులు చేసినా రాజస్ధాన్ ప్రభుత్వం మాత్రం శాంతించలేదు. ఏవో చిన్న మార్పులు చేసినంత మాత్రాన తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నట్లు భావిస్తున్న అక్కడవారికి ఈ సినిమా రిలీజ్ అయితే పెద్ద ఎత్తున గొడవలు జరుగుతాయని భావిస్తుంది అక్కడి ప్రభుత్వం.
ఈ నేపథ్యంలో చిత్రం విడుదలను నిషేధిస్తూ గతంలో సీఎం వసుంధర రాజే ఇచ్చిన ఉత్తర్వులను కొనసాగిస్తామని ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రి గులాబ్ చంద్ కటారియా స్పష్టంచేశారు. ఈ చిత్రం విషయంలో రాజ్పుత్ కర్ణిసేన కూడా తమ ఆందోళన కొనసాగిస్తోంది. ఈ చిత్రాన్ని విడుదల చేసే సినిమా థియేటర్లను తగలబెడుతామంటూ ఇప్పటికే ఆ సంస్థ ప్రకటించింది. మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని జనవరి 25న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.