పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాలను ప్రమోట్ చేయడు. కనీసం తన అభిమానులను కూడ తన సినిమాలను చూడమని అతడి కెరియర్ లో ఎప్పుడూ చెప్పలేదు. పవన్ ఏమి చెప్పకపోయినా అభిమానులు అన్నీ తామై పవన్ సినిమా విడుదలరోజున పెద్ద ఎత్తున హంగామా చేస్తూ ఉంటారు.
ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో ‘అజ్ఞాతవాసి’ మ్యానియాకు ఉపాసన కూడ తన చేతనైన సహకారం చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈరోజు విడుదలైన ‘అజ్ఞాతవాసి’ టిక్కెట్స్ దొరకాలి అంటే ఎంతో పరపతి ఉంటేగాని దొరకని విషయంగా మారిపోయింది.
ఈవిషయాన్ని గ్రహించిన ఉపాసన హైదరాబాద్ లో ‘అజ్ఞాతవాసి’ ప్రదర్శింప బడుతున్న వివిధ మల్టీ ప్లెక్స్ ధియేటర్ల నుండి 500 టిక్కెట్లు రప్పించుకుని తన అపోలో హెల్త్ కేర్ ఉద్యోగులకు షాకింగ్ గిఫ్ట్ గా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. రేపు మరో 500 టిక్కెట్లు తీసుకుని మెగా కోడలు ఉపాసన తన సంస్థలో మిగతా ఉద్యోగులకు కూడ ఇవ్వబోతోందని టాక్.
ఇది ఇలా ఉండగా నిన్న రాత్రి ‘అజ్ఞాతవాసి’ స్పెషల్ షోను పవన్ తన భార్య అన్నాతో అలాగే తన పెద్దకొడుకు అకిరాతో కూడ కలిసి శబ్దాలయ ప్రివ్యూ ధియేటర్ లో దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి చూసినట్లు తెలుస్తోంది. ‘అజ్ఞాతవాసి’ సినిమాను చూసి అకిరా నందన్ ఆనందం పట్టలేక తన తండ్రి పవన్ ను హత్తుకుని ముద్దు పెట్టుకున్నాడని తెలుస్తోంది. దీనితో మెగా అభిమానులకు మాత్రమే కాకుండా మెగా ఫ్యామిలీలో పండుగ వాతావరణాన్ని తీసుకు వచ్చింది అనుకోవాలి..