నందమూరి సింహం బాలకృష్ణ సెంటిమెంట్ ను నమ్ముకుని విడుదల అయిన ‘జై సింహా’ ‘అజ్ఞాతవాసి’ ఫెయిల్యూర్ అడ్వాంటేజీని ఏమాత్రం ఉపయోగించుకోలేక పోయింది. ఈ సినిమాకు కూడా డివైడ్ టాక్ రావడంతో ఈ మూవీ కలెక్షన్స్ కూడ అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే ఈ సినిమా యూనిట్ మాత్రం ప్రచారం విషయంలో ఏమాత్రం తగ్గకుండా సంక్రాంతి విజేత తమ సినిమానే అంటూ విపరీత మైన ప్రచారం చేసుకుంటోంది.
ఈ సినిమా 80 — 90 ల కాలంనాటి సినిమాల ఉందంటూ కామెంట్స్ వినిపిస్తున్నా అవి పట్టించుకోని ఈ సినిమా యూనిట్ తమ పబ్లిసిటీ సైతం అదే పాత తరహాలో చేస్తూ ఉండటం షాకింగ్ న్యూస్ గా మారింది. ‘‘సంక్రాంతి పండక్కి కూతుళ్లకి, కోడళ్లకి బంగారం కొని పెట్టడం మన ఆనవాయితి. కానీ ఈసారి పండక్కి ‘జై సింహా’ సినిమాని వాళ్లకి చూపించండి. బంగారం లాంటి సినిమా చూపించారు, ఇక మాకు బంగారం ఎందుకు అనకపోతే మీ టికెట్ డబ్బులకి మాది గ్యారెంటీ’’ అంటూ ఈ రోజు విడుదల చేసిన పబ్లిసిటీ పోస్టర్ ను చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
ఇలాంటి ప్రచారాలు 80 - 90 సంవత్సరాల ప్రాంతంలో చేసేవారు. ఇది ఇలా ఉండగా ‘జై సింహా’ టాక్ ఎలా ఉన్నప్పటికీ కలెక్షన్లు పర్వాలేదు అని వార్తలు వస్తున్నాయి. ‘అజ్ఞాతవాసి’కి మరీ దారుణమైన టాక్ రావడం ఈ సినిమాకు కలిసొచ్చింది. 'రంగుల రాట్నం’ కు కూడా యావరేజ్ టాక్ రావడంతో మాస్ ప్రేక్షకులకు ‘జై సింహా’నే ఫస్ట్ ఛాయిస్ గా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమాకు బి, సి సెంటర్లలో ఈ చిత్రానికి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి అని అంటున్నారు.
ఈ నేపధ్యంలో 'జై సింహ' మూవీ సంక్రాంతి విజేతగా జరుగుతున్న ప్రచారానికి బాలయ్య మంచి జోష్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో బాలయ్య కుటుంబం సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేస్తున్న నేపధ్యంలో బాలయ్య సంక్రాంతి జోష్ సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్ లో సందడి చేస్తున్నాయి. సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు బాలకృష్ణ నారావారిపల్లెలో సంక్రాంతి హడావిడి ఎంజాయ్ చేస్తూ ఆ ఊరంతా ఎడ్లబండిలో తిరుగుతూ బాలయ్య సందడి చేశాడు. నారావారి పల్లలో ఎడ్లబండి పై బాలకృష్ణ సంప్రదాయక దుస్తుల్లో దర్శనిమివ్వడంతో బాలయ్యను చూడటానికి అభిమానులు పోటేత్తారు అని వార్తలు వస్తున్నాయి..