ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో విషాదాలు వరుసగా చోటు చేసుకోవడంతో శోకసంద్రంలో మునిగిపోయింది. నిన్న గాక మొన్న (జనవరి 15) మళయాళ నటుడు సిద్ధు ఆర్ పిళ్లై గోవాలో శవమై కనిపించడం సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా షాక్కు గురిచేసిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీ అంతా ఆ షాక్ నుండి తేరుకోకముందే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ డబ్ల్యూబి రావు మృతిచెందాడనే మరో వార్త భారతీయ సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని కలచివేసింది.
వెటరన్ సినిమాటోగ్రాఫర్ డబ్ల్యూబి రావు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన మృతి చెందినట్లుగా పాశ్చాత్య ఇండియన్ సినిమాటోగ్రాఫర్ అసోసియేషన్ (WICA) అధికారి తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న రావు మంగళవారం ముంబైలోని భారతీయ ఆరోగ్య నిథి హాస్పిటల్లో మృతి చెందారు. 40 సంవత్సరాల సినీరంగంలో ఉన్న ఆయన హమ్, ఖుదాగవా, రంగీలా, రాజా హిందుస్తానీ, జుడ్వా, ధడకన్ లాంటి ఎన్నో చిత్రాలకు సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు.
1987లో ముఖుల్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇన్సాఫ్ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు రావు. ఆయన మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. ‘రావు చాలా గౌరవప్రదమైన సినిమాటోగ్రాఫర్. హమ్, ఖుదాగవా మరియు రంగీలా నా వ్యక్తిగత ఇష్టమైన సినిమాలు’ అని సినీ నిర్మాత సంగీత శివన్ అన్నారు.