తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్నారు మోహన్ బాబు. సాంఘిక, పౌరాణిక,జానపద చిత్రాల్లో ఎన్నో వైవిధ్యభరిత పాత్రలతో మెప్పించారు. అలనాటి మహానటులు ఎన్టీఆర్ కి ఎంతో ఆప్తుడిగా ఆయన మెప్పు పొందిన మోహన్ బాబు ఆయన నటించిన ఎన్నో సినిమాల్లో ప్రతినాయకుడిగా, కమెడియన్ గా నటించారు. ఇక దర్శకరత్న దాసరి నారాయణ రావు అంటే మోహన్ బాబు ఎంతో గౌరవించేవారు..ఇండస్ట్రీలో దాసరి తనకు దైవం ఇచ్చిన గురువు అని..ఆయన లేకుండా అసలు మోహన్ బాబు ఇండస్ట్రీలో ఉండేవారు కాదని ఎన్నో కార్యక్రమాల్లో చెప్పారు.
వీరి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కాయి. ఇక టీఎస్సాఆర్ కాకతీయ లలిత కళా పరిషత్ తరఫున మోహన్ బాబుకు విశ్వనటసార్వభౌమ బిరుదును ప్రదానం చేశారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్లోని శిల్పకళా వేదికగా ఈ సత్కార కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు.
బాలకృష్ణ, రాఘవేంద్ర రావు, జయప్రదతోపాటు సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్షన్ కింగ్గా పేరొందిన మోహన్ బాబు 42 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు.ఈ సందర్భంగా కళాబంధు టి.సుబ్బిరామి రెడ్డి ఆయణ్ని సన్మానించారు.
తెలుగు ఇండస్ట్రీలో 560 చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్లో అద్భుతమైన నటన కనబర్చిన మోహన్ బాబు తెలుగు సినీ రంగంపై తనదైన ముద్ర వేశారు. శ్రీవిద్యా నికేతన్ విద్యా సంస్థల ద్వారా కుల మతాలకు అతీతంగా పేద విద్యార్థులను చదువుకునే అవకాశం కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ‘గాయత్రి’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.